Rains in Telangana AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కర్ణాటక నుంచి కొమోరిస్ ప్రాంతం వరకు, దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఉన్న సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో ఆగస్టు 31 వరకు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం.  


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ ప్రాంతాల్లో నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షం పడుతుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మరో మూడు రోజులు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని చెప్పారు.
రాయలసీమలో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవిస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి..





తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో ఆగస్టు 31 వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఆగస్టు 29న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ వార్నింగ్ జారీ చేశారు. 


ఆగస్టు 30, 31న సైతం ఈ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. కానీ నగరంలో మోస్తరు వర్షం కురిసే అవకాశం లేదు. నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 23, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు నమోదైంది. వాయువ్యం, ఉత్తర దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.