- G -20 సదస్సు నిర్వహణ కారణంగా వైజాగ్ సిటీలో పోలీసుల ఆంక్షలు 
- 5 రోజుల పాటు డ్రోన్లు ఎగురవేయడం నిషేధించిన పోలీసులు 
- సహకరించాలని ప్రజలను కోరిన పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ 

వైజాగ్ లో మళ్ళీ పోలీస్ ఆంక్షలు మొదలయ్యాయి . ఈ నెల 28, 29, 30 తేదీలలో విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకముగా జరగనున్న జి-20 అంతర్జాతీయ సదస్సు సందర్బంగా నగర పోలీస్ కమిషనర్  సిహెచ్.శ్రీకాంత్  ఇతర  అధికారులతో సమావేశం నిర్వహించారు. తరువాత విశాఖలో ఆ తేదీల్లో ఎలాంటి ఆంక్షలు విధిస్తారో తెలిపారు. ఆయన మాట్లాడుతూ  సిబ్బంది ధరించవలసిన యూనిఫారం, సదస్సు వద్ద విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పాటించవలసిన నియమాలు, ట్రాఫిక్ మరియు ఇతర విధుల నిర్వహణలో పాటించాల్సిన  రూల్స్ గురించి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో విధులను నిర్వహించే విధానాలను గురించి  పోలీసులకు ఇప్పటికే ట్రైనింగ్ ఇప్పించినట్టు ఆయన చెప్పారు. 

 

 వైజాగ్   సీపీ శ్రీకాంత్ సూచనలు ఇవే :

- నగరానికి వస్తున్న పలు దేశాల G-20 ప్రతినిధులు,  ప్రముఖుల కోసం ఇప్పటికే పోలీసు సిబ్బందితో నిరంతర నిఘాతో, అన్ని భద్రతా చర్యలు చేపట్టడమైనది.
- జి-20 అంతర్జాతీయ సదస్సు వేదికను, సదస్సుకు వచ్చే

  విధేశీ ప్రతినిధులు బస చేయు ప్రముఖ హోటళ్ళను, వారు సందర్శించబోవు ప్రాంతాలను మరియు G-20 ప్రతినిధులు విహరించ బోయే  కాపులుప్పాడ వద్ద ఎనర్జీ ప్లాంట్, ముడసర్లోవలోని ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్, మాదవధారలోని వాటర్ సస్టైనబుల్ ప్రాజెక్టుల వద్దా పూర్తి బందో బస్తు ఏర్పాట్లు చేయడం జరిగినది.
- జి-20 అంతర్జాతీయ సదస్సు ప్రాంగణం వద్దా , ఎయిర్పోర్ట్ వద్దా, సదస్సుకు హాజరగు ప్రతినిధులకు వసతి కల్పించే  హోటళ్ల వద్దా  స్నిఫర్ డాగ్ స్క్వాడ్ తో, బాంబు స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
- జి-20 ప్రతినిధులు ప్రయాణించే మార్గాలలో రూట్ బందో బస్తు తో పాటు వి.ఐ.పి లు ప్రయాణించు రహదారులు, సదస్సు వద్దా పూర్తి నిఘాతో ఏ.ఎస్.సి ,ఆర్.ఓ.పి లు విధులు  నిర్వహిస్తున్నారు.
- నగరంలో ముఖ్య ప్రాంతాల్లో పికెట్స్,గార్డులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుంది.


వైజాగ్ లో రెడ్ జోన్ గా ప్రకటించిన మార్గాలు ఇవే :

విశాఖపట్నం నగరంలోని ఆరు ప్రాంతాల్లో 
 

1)రాడిసన్ బ్లూ రిసార్ట్స్,
2)ముడసర్లోవ పార్క్,
3)కైలాసగిరి కొండ,
4)ఆర్.కె. బీచ్,
5)జిందాల్ వేస్ట్ నుండి ఎనర్జీ ప్లాంట్, కాపులుప్పాడ రోడ్ 
6) ఎస్.సి.ఏ.డి.ఏ , మాధవధార.


లతో పాటు  G-20 సదస్సు కు హాజరుకానున్న ప్రతినిధులు ప్రయాణించే మార్గంలో "తాత్కాలిక రెడ్ జోన్"గా ప్రకటించడమైనదని,ఈ నిషేధాన్ని ఉల్లంఘించి (డ్రోన్లు) సహా ఏవైనా సాంప్రదాయేతర వైమానిక వస్తువులు ఎగురవేసిన యెడల వాటిని నాశనం చేయడం తో పాటు  IPC  చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం అని సీపీ  తెలిపారు 

27 వతేదీన G-20 ప్రతినిధులు పలు ప్రాంతాలను సందర్శిస్తారని, 28వ తేదీన గాలా డిన్నర్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయనీ, 29వ తేదీన ఉదయం యోగా కార్యక్రమం ఉంటుందనీ, జి-20 ప్రతినిధులు నగరంలో పలు ప్రాంతాలను సందర్శిస్తారనీ, అతిధులైన పలు దేశాల ప్రతినిధులు సందర్శించే రోజుల్లో పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు ప్రవేశం ఉండదనీ ప్రజలకు పోలీసులు సూచించారు. 

 

ప్రజలకు  అలానే సదస్సుకు హాజరయ్యే వారికి ట్రాఫిక్ లో అసౌకర్యం, అంతరాయం కలగకుండా ఈ  ఏర్పాట్లు చేశామని, కనుక ఈ నెల 28, 29, 30 తేదీలలో రాడిసన్ హోటల్ పరిసర ప్రాంతాలు, బీచ్ రోడ్, ఇతర జంక్షన్లు రద్దీగా ఉండే అవకాశం ఉన్నందున నగరవాసులు పోలీసులకు సహకరిస్తూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణం చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి వైజాగ్ పోలీసులు తెలిపారు. 

 

ఎయిర్ పోర్ట్ రూట్ లోనూ ఆంక్షలు 

 G-20 ప్రతినిధుల పర్యటన సందర్బంగా ఎయిర్ పోర్ట్ నుంచి తాటిచెట్లపాలెం, వేమన మందిరం, సిరిపురం, సి ఆర్ రెడ్డి, పార్క్ హోటల్, కురుపాం జంక్షన్, రాడిసన్ హోటల్ వరకూ ప్రజలు, వాహన దారులు గమనించి నగర పోలీసులకు సహకరిస్తూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణం చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని వైజాగ్ వాసులకు పోలీసులు సూచించారు.