గత కొన్నిరోజులుగా  ఏపీ , బెంగాల్ రాష్ట్ర  వార్తల్లో నిలిచిన బెంగాల్  స్టూడెంట్  రీతి సాహా అనుమానాస్పద మృతి కేసును ఆత్మహత్యే అని తేల్చారు. ఆమెకు సూసైడల్ టెండెన్సీ ఉందని వివరించారు. డిప్రెషన్‌లో ఉందని  తెలిసి కూడా రాత్రి పూట టెర్రస్‌పైకి వెళ్లనిచ్చారని దీనికి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమని చెప్పారు. ఆమె చదువుతున్న ఆకాశ బైజూస్‌కు చెందిన సిబ్బంది ఇద్దరినీ, ఆమె ఉంటున్న హాస్టల్ సిబ్బంది ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు ఏపీ పోలీసులు. 


రెండు రాష్ట్రాల్లో కలకలం రేపిన  రీతి సాహా మృతి 
వెస్ట్ బెంగాల్‌కు చెందిన రీతి సాహా చదువు కోసం వైజాగ్ వచ్చింది. నరసింహా నగర్‌లోని బైజూస్ ఆకాశ్‌లో చదువుకుంటూ అదే కాలేజ్‌కి చెందిన సాధన హాస్టల్‌లో ఉంటుంది. జులై 14న రాత్రి సమయంలో హాస్టల్ 4th ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది. సిబ్బంది వెంటనే ఆమెను దగరలోని వెంకటరామ హాస్పిటల్‌కు తరలించినా లాభం లేకపోయింది. దీనిపై దర్యాప్తు చేసిన విశాఖ పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు.


వెస్ట్ బెంగాల్  సీఎం మమతా బెనర్జీకి కంప్లైంట్ 
తన కుమార్తెది ఆత్మహత్య కాదని హత్యే అంటూ రీతి తండ్రి సుఖ్ దేవ్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి ఫిర్యాదు చేశారు. వైజాగ్ పోలీసుల విచారణ సరిగా లేదని తమ కూతురుది ముమ్మాటికీ హత్యేనంటూ ఆరోపించారు. ముఖ్యంగా సీసీ టీవీలో చూస్తే ఆమె హాస్టల్‌లోకి వెళ్తున్న ప్పటి డ్రెస్, బిల్డింగ్‌పై నుంచి పడిపోయినప్పటి డ్రెస్ ఒకటి కాదనీ అన్నారు. ఎవరో మగ వ్యక్తి తన కూతురిని హత్య చేస్తే పోలీసులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 


ఇది బెంగాల్లో పెద్ద సంచలనం కావడం...అక్కడి సీఎం మమతా స్పందించారు. బెంగాల్‌ సీఐడీని వైజాగ్ పంపారు. మరోవైపు సుఖదేవ్ సాహా కూడా ఏపీ హై కోర్టును ఆశ్రయించారు.


రీతికి సుసైడల్ టెండెన్సీ ఉంది: హాస్టల్ వార్డెన్
రీతి సాహాకు సూసైడల్ టెండెన్సీ ఉందనీ..ఆమె క్లాస్ రూమ్‌లో చేయి కోసుకోవడానికి ట్రై చేసేదంటున్నారు హాస్టల్ వార్డెన్. ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడినప్పుడు రూమ్‌లో గట్టిగా అరిచేదని చెబుతున్నారు. వస్తువులు విసిరేయడం వంటి పనులు చేసేదని తెలిపారు. వైజాగ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు నిర్లక్ష్యంగా చేశారని బెంగాల్ నుంచి వచ్చిన సీఐడీ, ఏపీ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన పోలీసులు అన్నారు. దీంతో నాలుక్కరుచుకున్న వైజాగ్ పోలీసులు ముందు నమోదు చేసిన సెక్షన్‌లు కాకుండా అనుమానాస్పద కేసుగా రిజిష్టర్ చేశారు. మొదట నమోదు చేసిన CRPC సెక్షన్ 174తోపాటు సెక్షన్ 304 పార్ట్ 2 వంటి అదనపు సెక్షన్‌లు యాడ్ చేశారు. 


ఘటన జరిగిన తర్వాత రీతి తల్లిదండ్రుల అనుమానాలను వైజాగ్ 4th టౌన్‌ పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని బెంగాల్ సీఐడీ, ఏపీ పోలీస్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. తాము సేకరించిన వివరాలతో వెస్ట్ బెంగాల్ అధికారులు తమ రాష్ట్రానికి తిరిగి వెళ్ళారు.


రీతి ది ఆత్మహత్యే : ఏపీ పోలీసు
రెండోసారి ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా రీతి సాహాది ఆత్మ హత్యే అని అయితే ఈ కేసు విషయంలో నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిన నేరానికి నలుగుర్ని అరెస్టు చేశారు. సాధన లేడీస్ హాస్టల్-2 వార్డెన్ గన్ను కుమారి, సాధన హాస్టల్స్ యజమాని ఎచ్చెర్ల సూర్య కుమారి, ఆకాష్ బైజూస్ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ గంగుమల్ల నాగ వెంకట దుర్గా రవికాంత్, గుండు రాజేశ్వరరావు, ఆకాష్ బైజూస్ బ్రాంచ్ విశాఖపట్నం సిటీ మేనేజర్‌ను అరెస్ట్ చేశారు.


దీనితో గత కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల్లో వార్తల్లో నిలిచిన రీతి సాహా అనుమానాస్పద మృతి కేసు ఓ కొలిక్కి వచ్చినట్లయింది. అయితే దీనిపై బెంగాల్ సీఐడీ సేకరించిన ఆధారాలతో తమ సీఎంకు ఎలాంటి నివేదిక ఇస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అలాగే రీతి తండ్రి సుఖ దేవ్ సాహా స్పందన తెలియాల్సి ఉంది.