వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామన్న కెసిఆర్ దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతున్నారు.  అవసరం అయితే తెలంగాణ తరపున స్టీల్ ప్లాంట్ కోసం బిడ్డింగ్‌లో పాల్గొంటామని చెప్పిన కెసిఆర్ సింగరేణి నుంచి ప్రత్యేక బృందాన్ని వైజాగ్ పంపారు. 


ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి చేస్తున్న పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మద్దతు ప్రకటించిన ఒక్క రోజు వ్యవధిలోనే తెలంగాణ నుంచి అధికారులను కెసిఆర్ పంపడం ఒక్కసారిగా రాజకీయాల్లో వేడి పుట్టించింది . తెలంగాణ నుంచి వచ్చిన అధికారుల్లో సింగరేణి కాలరీస్ డైరెక్టర్ సత్యనారాయణ రావు, సుబ్బారావు, బలరాం తదితరులు ఉన్నారు. 


వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ కార్యాలయంలో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్స్ వేణుగోపాలరావు, భగీచి, మహంతితో వారు చాలా ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిపారు. ఈ భేటీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నడపడానికి కావాల్సిన ముడిసరకు ఎలా వస్తుంది, వర్కింగ్ క్యాపిటల్ ఎలా సమకూరుతుంది లాంటి అంశాలపై సింగరేణి అధికారులు అడిగి తెలుసుకున్నారు . 


ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాం : విశాఖ ఉక్కు  పరిరక్షణ సమితి 


వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా రెండేళ్లకుపైగా పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులను సింగరేణి నుంచి వచ్చిన అధికారులు కలిసి ఇక్కడి సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అని విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటీకరణ నుంచి కాపాడే ప్రయత్నంలో కెసిఆర్‌కు ఎలాంటి సహకారం అందించడానికైనా తాము సిద్ధం అని కమిటీ సభ్యులు తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చిన అధికారులతో భేటీ అయిన వారిలో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఆదినారాయణ, అయోధ్య రామ్, రామచంద్రరావు, మస్తానప్ప తదితరలు ఉన్నారు 


కేంద్రంపై విరుచుకు పడ్డ కేటీఆర్ 


"ఒక కుక్కను చంపాలంటే ముందు దానికి పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి. తర్వాత దాన్ని కాల్చి చంపితే ఎవ్వరూ ఏం అనరు. ఆ అజెండాలో భాగంగా 2018లో బైలదిల్లాలోని ఐరన్ ఓర్‌ను జపనీస్, కొరియా స్టీల్ మిల్లులకు సరఫరా చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్వల్ప సమయంలోనే ‘అదానీ బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ పెట్టారు. వెంటనే సదరు జపనీస్ స్టీల్ కంపెనీలతో ఒప్పందం ఏర్పాటు చేసుకొని గుజరాత్ లోని ముంద్రాలో స్టీల్ ప్లాంటు పెడతానని ప్రకటించారు. "-కేటీఆర్


‘‘ఒక్క బైలదిల్లాను ఆదానీకి కట్టబెట్టడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు చావు దెబ్బతిన్నాయి. అందుకే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని చెప్పేశారు. అదానీకి ఇచ్చినంక ఇంకెట్ల సాధ్యమైతది. కుక్కను చంపేముందు పిచ్చి కుక్క అని ముద్రేసినట్లు విశాఖ ఉక్కుకు ముడి ఖనిజ గనులు కేటాయించకుండా.. కావాలని బలవంతంగా నష్టాల్లోకి నెట్టి, తక్కువ ధరకే ప్రైవేటు పరం చేస్తున్నారు. బైలదిల్లా నుంచి బయ్యారం 160 కి.మీ., విశాఖపట్నానికి 600 కి.మీ., గుజరాత్ లోని ముంద్రాకు 1800 కి.మీ., ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీలకు సాధ్యం కానిది ముంద్రాలోని ఫ్యాక్టరీలకు ముడి ఖనిజాన్ని తరలించడం ఎలా సాధ్యం అవుతుంది?’’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.