TDP Leaders On YCP: గన్నవరం ఘటనతో ఆంధ్రా ప్రజానీకానికి ఓ అభద్రతా భావం కలిగిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. జగన్ ఓ శాడిస్ట్, దుర్మార్గుడు అనేది తెలిసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన ఇలా ఉంటుందని ప్రజలు భావించలేదని.. విశాఖజిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరి సమావేశంలో తెలిపారు. పోలీసుల సమక్షంలోనే ఇలా జరగడం దారుణం అన్నారు. దాడి చేస్తున్న దుండగులను పోలీసులు అరెస్ట్ చేయాల్సింది పోయి బతిమాలుతున్నారని ఆయన వివరించారు. తమపై కేసులు పెట్టడం చాలా దారుణం అని కేసు పెట్టేందుకు వెళ్లిన పట్టాభి ఏమయ్యారనేది పోలీసులు చెప్పాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా భారత దేశంలోనే ఓ భాగమే అని హోం మంత్రి అమిత్ షా అనుకోవడం లేదా అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ బర్తరఫ్ చేసి, ఏపీ డీజీపీని సరెండర్ చెయ్యాలని అన్నారు. డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి రిటైర్ అయ్యిన తరువాత ఇంట్లో ఉన్న నిన్ను కొడితే ఎవరు కాపడతారని ప్రశ్నించారు. అప్పుడు నిన్ను కాపాడాల్సింద చంద్రబాబే అని గుర్తించాలన్నారు. పట్టాభి భార్యకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని అన్నారు. తక్షణమే వంశీని అరెస్ట్ చేయాలని సూచించారు. 


జెడ్ కేటగిరి ఉన్న మాజీ సీఎం ఏడు కిలోమీటర్లు నడిచేలా చేశారు..


టీడీపీ విశాఖ పార్లమెంట్  అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. గొప్ప వ్యక్తులు వచ్చిన ప్రాంతం గన్నవరం అని గుర్తు చేశారు. కానీ వంశీ లాంటి వ్యక్తిని మరోసారి గెలవకుండా చూసే బాధ్యత గన్నవరం ప్రజలదే అని అన్నారు. ప్రజలు ఇలాంటి దుండగులకు బుద్ధి చెప్పాలని.. పోలీసులు బాధ్యతగా ఉంటే ఇలాంటి ఘటనలు జరగవని పేర్కొన్నారు. ఐపీఎస్ లు అధికార పార్టీ  నేతలకు తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. జెడ్ కేటగిరి ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఏడు కిలోమీటర్ల నడిచేలా చేశారని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ మార్క్ గుండా పాలన జరుగుతోందన్నారు. సజ్జల దర్శకత్వంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేదా పాకిస్తాన్ లో ఉన్నామా అనే అనుమానం కల్గుతోందని చెప్పారు. వంశీది దారుణమైన చరిత్ర అని.. వంశీ టీడీపీ బీ ఫార్మ తీసుకుని గెలిచి, అదే టీడీపీ ఆఫీస్ మీదకు వస్తావా అని ప్రశ్నించారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. వెంటనే వంశీని, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని సూచించారు. మరోసారి ఇలాంటి ఘటన జరిగితే.. నేరుగా మేమే దాడికి పాల్పడతామని హెచ్చరించారు. 


పెద్ద ఎత్తున పాల్గొన్న టీడీపీ నేతలు..


ఈ సమావేశంలో విశాఖ పార్లమెంటు అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి వర్యులు బండారు సత్యనారాయణ మూర్తి, కొండ్రు మురళి, విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ దువ్వవరపు రామారావు, విశాఖ దక్షిణ నియోజకవర్గ  ఇన్చార్జ్ గండి బాబ్జి, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్, వార్డ్ అధ్యక్షుడు కాళ్ల శంకర్ మద్దిలరాజశేఖర్  తదితరులు పాల్గొన్నారు.