కేజీఎఫ్‌ సినిమా చూసిన వారందరికీ వీర ప్రతిమ గురించి తెలిసే ఉంటుంది. అందులో హీరో రాకీ.. వీర ప్రతిమను భూమిలో నుంచి తవ్వించి తీయడంతోనే సినిమా మొదలవుతుంది. చివరిలో ఆ వీర ప్రతిమను భూమిలో పాతిపెట్టడంతో సినిమా ముగుస్తుంది. ఇంతకీ ఈ వీర ప్రతిమ ఏంటీ? దానికి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు.? వీర ప్రతిమలు నిజంగానే ఉండేవని మీకు తెలుసా.. ?


వీర ప్రతిమల వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది. మనకు అర్థమవ్వాలని సినిమాలో దాన్ని వీర ప్రతిమ అని డైలాగుల్లో చెప్పించారు గానీ వీటి
అసలు పేరు వీరకల్లు. KGF సినిమా తమిళ, కన్నడ వెర్షన్‌లలో దానిపేరు అలానే ఉంటుంది. వీర అంటే వీరుడు.. కల్లు అంటే రాయి.


అసలేంటి ఈ వీర ప్రతిమ అంటే ?.


ప్రాచీన కాలంలో యుద్దాల్లో వీరోచితంగా పోరాడి చనిపోయిన యోధుల జ్ఞాపకార్ధం చెక్కించిన రాతి ప్రతిమలనే వీర కల్లు అని పిలిచేవారు. ఇప్పటి వరకూ దొరికిన ఈ వీర ప్రతిమల్లో అన్నింటికన్నా ప్రాచీనమైనది ఏకంగా క్రీ. పూ. 4వ శతాబ్దంలో తమిళనాడులో దొరికింది. అలా దొరికిన వాటిలో అతి పెద్దది కర్నాటకలో క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందినది. ఒక్క కర్ణాటకలోనే ఇలాంటి వీర ప్రతిమలు ఏకంగా 2650ఉన్నాయి. దక్షిణాదిలో ఈ సంప్రదాయం 18 వ శతాబ్దం వరకూ కొనసాగింది. వీటిని సాధారణంగా గుళ్ల లోనో.. లేక ఆ వీరుణ్ణి పాతి పెట్టిన ప్రదేశంలోనో లేక అతను చనిపోయిన చోటనో ఏర్పాటు చేసేవారు .

 


ఈ వీర ప్రతిమలు ఎలా ఉండేవి


సాధారణంగా ఈ వీర ప్రతిమలు మూడు భాగాలుగా ఉండేవి. పైభాగంలో ఆ వీరుడు కొలిచిన దేవత లేక దైవం పేరు మధ్య భాగంలో వీరుడి బొమ్మ మూడో భాగంలో ఆయన వీర మరణం పొందిన యుద్ధ సంఘటనలు. ఆ వీరుడు ఎవరి కోసం యుద్ధం చేసాడో ఆ రాజు పేరు చెక్కేవారు. ఈ వీరగళ్ళు సాధారణంగా మూడు నుంచి 5 అడుగుల మధ్య ఉంటాయి. కానీ కర్నాటకలోని బేతగిరిలో దొరికిన ఒక వీరకల్లు ఏకంగా 12 అడుగుల ఎత్తు ఉంది. 12 వ శతాబ్దానికి చెందిన రెండు వీర ప్రతిమలు 2017లో దొరికాయి. అవి చాలా అరుదైనవి. ఎందుకంటే అవి యుద్ధంలో పోరాడి చనిపోయిన ఇద్దరు స్త్రీ యోధులకు చెందినవి. అంటే ఆ రోజుల్లో యుద్ధ క్షేత్రంలో స్త్రీ సైనికులు సైతం పోరాడేవారని తెలుస్తుంది .


వీర కల్లు ను బట్టి వీరుడు ఎలా చనిపోయాడో కూడా చెప్పొచ్చు :.


తవ్వకాల్లో దొరుకుతున్న వీర ప్రతిమల ఆధారంగా వీరుడు ఎలా చనిపోయాడో కూడా చెప్పొచ్చు అంటారు చరిత్రకారులు. ఉదాహరణకు వీర ప్రతిమలో వీరుడు గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు ఉంటే అతనితోపాటు గుర్రం కూడా యుద్ధంలో చనిపోయినట్టు అర్థం. అలానే రాజస్థాన్‌కు చెందిన కొన్ని వీర ప్రతిమల్లో వీరుడు ఒంటిపై స్వారీ చేస్తున్నట్టు ఉంటుంది. దానర్ధం అతనితోపాటు ఆ ఒంటె కూడా యుద్ధంలో చనిపోయిందని. అలాగే వీరుడు చేతిలో ఆయుధం ఉంటే ఆ వీరుడు యుద్ధక్షేత్రంలోనే చనిపోయినట్టనీ ఆయుధం లేకుండా ఉంటే యుద్ధంలో గాయపడి తర్వాత చనిపోయినట్టనీ చరిత్రకారులు గుర్తిస్తారు. సాధారణంగా ఈ వీర ప్రతిమలు రాజులు, దళపతులూ, ముఖ్యమైన వీరుల మరణాలకు చెంది ఉంటాయి.


బాహుబలి మూడు బాణాల వీర ప్రతిమ


ఇలా దొరికిన వీర ప్రతిమల్లో కొన్ని బాహుబలి సినిమాలో చూపించిన మూడు బాణాలను ఒకేసారి వాడుతున్నట్టు ఉంటుంది. దీనినిబట్టి ఆరోజుల్లో ఇలాంటి యుద్ధ కళ కూడా ఉండేదని అర్ధం అవుతుంది. ఇలా దొరికిన వాటిలో ఎక్కువగా పల్లవ సామ్రాజ్యం కాలం నాటివి. కేవలం మనుష్యులకే కాదు అత్యంత అరుదుగా జంతువుల పేరు మీద కూడా వీరకల్లు  చెక్కించేవారు. వాటిలో ఒకటి  క్రీ.శ. 939 నాటిది. గంగ సామ్రాజ్య రాజు రెండో బుతుగకు చెందిన శునకం ఒక అడవి పందిని వేటాడుతూ చనిపోవడంతో దానిపేరు మీద కూడా వీర ప్రతిమను చెక్కించారు.


గతంలో వీటికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ కేజీఎఫ్‌ లాంటి పాన్ ఇండియా సినిమాతో ఇప్పుడు మళ్లీ ఈ వీర ప్రతిమలు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.