Gap between AP CM YS Jagan and MP Vijayasai Reddy: ఎంపీ విజయ సాయిరెడ్డి దూకుడు ఇటీవల అధికార వైఎస్సార్‌సీపీలో తగ్గినట్లు కనిపిస్తోంది అని గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీలో జరుగుతున్న పదవుల పంపకంలో అయన పాత్రను పరిమితం చేశారనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా గతంతో పోలిస్తే కాస్త విభిన్నంగానే కనిపిస్తోంది. పార్టీ, ప్రభుత్వం చేపట్టిన మెగా జాబ్ మేళా నిర్వహణ బాధ్యతలు చూస్తున్న విజయసాయిరెడ్డి జాబ్ ఎందుకు సందిగ్ధంలో పడింది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.


ఇటీవల పార్టీలో జరిగిన పదవుల పంపకం సందర్బంగా విజయసాయిరెడ్డి పాత్రను బాగా పరిమితం చేసారని వైసీపీ వర్గాల్లోనే  అనుకుంటున్నారు. మొన్నటివరకూ  ఆయన మాట ఉత్తరాంధ్రలో చెల్లుబాటు అయ్యేది. అయితే జిల్లాల విభజన, మంత్రి వర్గ పునర్వవస్థీకరణ (AP New Cabinet) కు ముందు  విజయ సాయిరెడ్డిని పార్టీ అనుబంధ సంస్థల ఇంచార్జ్ గా నియమించారు. ఇది కేవలం క్రొత్త మంత్రులు వచ్చేవరకూ, జిల్లాల పునర్వవస్థీకరణకూ సౌకర్యంగా ఉండేందుకు మాత్రమే అని అంతా అనుకున్నారు. ఆ రెండు పనులూ పూర్తయ్యాయి. అయినప్పటికీ విజయసాయిరెడ్డిని పార్టీ అనుబంధ సంస్థల ఇంచార్జ్ గా మాత్రమే ఇంకా  కొనసాగిస్తున్నారు.


విజయసాయిరెడ్డి తనదిగా భావించి చక్రం తిప్పుతున్న విశాఖ జిల్లా ముక్కలు కావడంతో పాటు కొత్త జిల్లాలకు ఇంచార్జీలను పార్టీ అధినేత నియమించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అవంతి శ్రీనివాస్, ఇంచార్జ్ మంత్రిగా విడదల రజని తెరమీదకు రాగా అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడికి పార్టీ కో-ఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులు కావడంతో్ అంతా షాకయ్యారు. విజయసాయిరెడ్డి పాత్రను ఉత్తరాంధ్ర లో పరిమితం చెయ్యడం కోసమే ఈ మార్పులన్నీ ప్రచారం మొదలైంది. దానికి తగ్గట్టే విజయసాయిరెడ్డి బాడీ లాంగ్వేజ్ కూడా మారిందని విశ్లేషకుల అభిప్రాయం. తనను పార్టీ అనుబంధ సంస్థల ఇంచార్జ్ గా మాత్రమే ఇంకా కొనసాగించడం పై స్పందిస్తూ అంతా అధినేత ఇష్టమనీ.. చార్టెడ్ అకౌంటెంట్ అయిన తనకు ఎన్నో బాధ్యతలు ఇచ్చారని జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యం అని అన్నారు. నిజానికి ఇలాంటి ప్రశ్నలకు ఇంతకుముందు విజయసాయిరెడ్డి రియాక్ట్ ఆయ్యేవారే కాదు. కానీ సీఎం జగన్ కు విజయ సాయిరెడ్డికి కొంత గ్యాప్ వచ్చిన నేపథ్యంలోనే పార్టీ రాజ్యసభ సభ్యుడు ఇలా స్పందించారని గుసగుసలు వినిపిస్తున్నాయి . 


జగన్‌కు ఆ ముగ్గురే ముఖ్యమా!
వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి.. జగన్‌కు అత్యంత సన్నిహితమైన నేతలు. నిన్న మొన్నటివరకూ ఈ ఈక్వేషన్ ఇలానే ఉండేది. ఢిల్లీతో సమన్వయం చేసుకోవడం, ఉత్తరాంధ్రలో పార్టీ బాధ్యతలు విజయసాయిరెడ్డి, రాయలసీమ బాధ్యతలు, టీటీడి వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ పాలన సలహాదారుగా సజ్జల పార్టీకి వెన్నెముకగా పనిచేసేవారు. అయితే ప్రస్తుతం వీరిలో విజయసాయిరెడ్డి కి, సీఎం జగన్‌కు మధ్య ఎక్కడో చిన్న గ్యాప్ అయితే వచ్చిందనే ప్రచారం మొదలైంది. ఇటీవల పార్టీ తిరుపతిలో చేపట్టిన మెగా జాబ్ మేళాలో విజయసాయిరెడ్డిని కలవడానికి స్థానిక వైసీపీ నాయకులు పెద్దగా రాలేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. వైసీపీలో జగన్ తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న నేతల్లో ఒకరిగా పేరున్న విజయసాయిరెడ్డితో జగన్ ప్రస్తుతం ముభావంగా ఉన్నారన్న ప్రచారం ఉంది. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ టూర్ లోనూ విజయసాయిరెడ్డికి గతంతో పోలిస్తే ప్రాధాన్యత తగ్గింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . 


కారణాలు ఇవేనా ?
ఇటీవల విశాఖ ప్రాంతంలో వరుస భూ వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. దీనివల్ల విశాఖ ప్రాంతంతో పాటు పార్టీ ఇమేజ్ పై కూడా దెబ్బ పడుతోంది. ఇది సీఎం జగన్ అసహనానికి కారణం అయ్యింది అంటున్నాయి పార్టీ వర్గాలు. అలాగే ఇటీవల విజయసాయిరెడ్డి ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సన్నిహితంగా మెలుగుతున్నారనే ప్రచారం కూడా జగన్‌కూ ఆయనకూ మధ్య కాస్త గ్యాప్ పెంచిందని అంటున్నారు. మొన్నటి జగన్ ఢిల్లీ పర్యటనలోనూ విజయసాయిరెడ్డి కి అంతగా ప్రాధాన్యం లభించలేదన్నట్లు కనిపించింది. నిన్నమొన్నటి వరకూ ఉత్తరాంధ్రలో పార్టీ సమన్వయకర్తగా ఓ వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డిని ఆ పాత్ర నుండి తప్పించడం, అదే సమయంలో సజ్జలకు పార్టీల ఇంచార్జ్‌ల సమన్వయకర్తగా అదనపు బాధ్యతలు అప్పగించడడం, వైవీ సుబ్బారెడ్డికి వైజాగ్, అనకాపల్లి, మన్యం జిల్లాల సమన్వయ బాధ్యతలు ఇవ్వడం లాంటి అంశాలు వైఎస్సార్‌సీపీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం గతంతో పోలిస్తే తగ్గిందనే ఆరోపణలకు ఊతమిస్తోంది. 


ఆల్ ఈజ్ వెల్.. విజయసాయిరెడ్డి వర్గం 
సీఎం జగన్‌ వద్ద ప్రాధాన్యం, పార్టీలో బాధ్యతలు అందకపోవడంపై విజయసాయిరెడ్డి వర్గం మాత్రం వేరేలా చెబుతోంది. సీఎం జగన్, విజయసాయిరెడ్డికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదనీ.. 2024 ఎన్నికలకు రంగం సిద్దమైన నేపథ్యంలో పార్టీ పరంగా పూర్తిగా తన దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా విజయసాయిరెడ్డికి అనుబంధ సంస్థల ఇంచార్జ్ పదవిని ఇచ్చారని అంతేగానీ జగన్ వద్ద ఇప్పటికీ విజయ సాయిరెడ్డి ప్రాధాన్యత అలానే ఉందంటున్నారు. మరి నిజానిజాలేంటో తెలియాలంటే మరికొద్దికాలం వేచి చూడాల్సిందే.