Kinjarapu Atchannaidu: అధికారం వచ్చిందన్న అహంకారం ఏమాత్రం ఉండొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత చెబుతున్నా కొందరు తెలుగు తమ్ముళ్లకు పట్టడం లేదు. వ్యవస్థలను గౌరవిస్తూ ప్రజలకు సేవలు అందేలా చూడాలని వివరిస్తున్నా వాళ్లు చెవికి ఎక్కించుకోవడం లేదు అనేందుకు విశాఖలో జరిగిన ఓ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది.


కొందరు తెలుగు తమ్ముళ్లు ఏదో పని మీద శ్రీకాకుళం నుంచి వైజాగ్ వచ్చారు. వచ్చిన పని అయిపోవడంతో కార్లలో ఊరు బయల్దేరారు. అయితే మార్గ మధ్యలో పోలీసులు వారికి డ్రంకన్ డ్రైవ పరీక్షలు చేశారు. కార్లు దిగిన వారంతా పోలీసులపై దూసుకెళ్లారు. మంత్రి అచ్చెన్న మనుషులకే డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేస్తారా అంటూ దుర్భాషలాడారు. 


ఫుల్‌గా తాగిన ఓ వ్యక్తి కారణంగా ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడని... అందుకే విశాఖ సీపీ చాలా సీరియస్‌గా ఉన్నారని ఎవరికైనా డ్రంకన్ డ్రైవ టెస్టులు చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. అటు నుంచి తెలుగు తమ్ముళ్లు కూడా తగ్గ లేదు. అధికారంలో ఉన్న తమకే పరీక్షలు ఏంటని ప్రశ్నించారు. సీపీ కాదు హంమంత్రి కూడా తమ కిందే పనిచేయాల్సి ఉంటుందని తీవ్ర పదజాలంతో దూషించారు. 
పోలీసులు ఎంత చెబుతున్నా వినిపించుకోలేదు. ఒకవేళ పరీక్షలు చేస్తే రేపు అక్కడ ఉన్న పోలీసులంతా వీఆర్‌కు వెళ్తారని కూడా బెదిరించారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. పోలీసులు కూడా అదేస్థాయిలో సమాధానం చెప్పారు. 






అచ్చెన్న పేరు చెప్పుకొని ఇలాంటివి చేస్తే ఆయనకే చెడ్డ పేరు వస్తుందని పోలీసులు వారించే ప్రయత్నం చేశారు. చాలా సమయం వీరి మధ్య వాగ్వాదం జరిగింది. కారు తీసుకోమని చెప్పిన ఆ నేతలు... తాము బస్‌లో వెళ్లిపోతామని విసురుగా సమాధానం చెప్పారు. అయితే పరీక్షలు తర్వాత మీ ఇష్టమని చెప్పారు. 


చివరకు పరీక్షలు చేశారు. డ్రైవింగ్ చేసే వ్యక్తి తాగినట్టు నిర్దారించారు. అతన్ని ఆసుపత్రి తరలించాలని పోలీసులు చెప్పడం... అక్కడే ఉన్న వ్యక్తి మనమంతా ఒక కుటుంబమని అనడం... మరో వ్యక్తి వీడియోలు తీసుకొని ఏం చేస్తారో చేసుకోమని సవాల్ చేయడం అన్నీ ఈ రెండున్నర నిమిషాల వీడియోలో రికార్డు అయ్యాయి. 


ఈ వీడియోను వైసీపీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌(X)లో పోస్టు చేసింది. గతంలో అచ్చెన్న కామెంట్స్‌ను కోట్ చేస్తూ ఆయనకి ట్యాగ్ చేసింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో అచ్చెన్న ఓ సంచలన కామెంట్స్ చేశారు. అధికారుల వద్దకు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్తే ఆఫీస్‌లో కూర్చోబెట్టుకొని టీ ఇచ్చి మరీ పనులు చేసి పెడతారని అన్నారు. ఆవిషయాన్ని ఇప్పుడు వైసీపీ గుర్తు చేస్తోంది. 


Also Read: కువైట్‌లో మోసపోయిన సీమవాసికి విమక్తి - లోకేష్ చొరవతో ఇంటికి చేరుకున్న శివ 


Also Read: శాఖ ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాల నిలిపివేత - కలెక్టర్ నుంచి నివేదిక కోరిన సీఎంవో