Anakapalli News: అనకాపల్లిజిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లోని మరో పరిశ్రమలో ప్రమాదం జరిగింది. వసంత కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ పేలి ఓ కార్మికుడు మృతి చెందాడు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు అక్కడకు చేరుకున్నారు. ప్రమాద ఘటనపై హోం మంత్రి అనిత కూడా స్పందించారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. సహాయక చర్యలు వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. 


ఒడిశా కార్మికుడు మృతి 


అనకాపల్లిజిల్లా రాంబిల్లి మండలంలోని అచ్యుతాపురం సెజ్‌లో మరో ప్రమాదం జరిగింది. వసంత కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. రియాక్టర్ పేలుడో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలు చూసిన అక్కడి కార్మికులు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన 44 ఏళ్ల ప్రదీప్‌ రౌత్‌ మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాప సిబ‌్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను అతికష్టమ్మీద అదుపులోకి తీసుకొచ్చారు. 


తక్షణం స్పందించిన అధికారులు 


ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే జిల్లా యంత్రాంగంతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. సెజ్‌లో ఏం జరిగిందో తెలుసుకున్నారు. తక్షణమే ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి వాస్తవ పరిస్థితి వివరించాలని సూచించారు. గాయపడిన వాళ్లు ఉంటే మెరుగైన వైద్యం అందిలా చూడాలన్నారు. మృతుడి ఫ్యామిలీ మెంబర్స్‌కు విషయాన్ని చేరవేసి తర్వాత జరగాల్సిన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.