Minister Gudivada Amar: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మంచి మనసు చాటుకున్నారు. స్థానిక పోలీస్ బ్యారెక్స్‌లోని చిన్నారులతో కలిసి శుక్రవారం దీపావళి సంబరాలు జరుపుకొన్నారు. చిన్నారులకు క్రాకర్స్ పంచి పెట్టారు. విజయ్ ధరణ్, సిమ్రన్ హీరో, హీరోయిన్లుగా అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో గణపతి రెడ్డి నిర్మాతగా వీజే కన్నా డైరెక్షన్లో రూపుదిద్దుకున్న అన్వేషి సినిమా ఈనెల 17వ తేదీన విడుదల కానుంది. 


ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంత్రి అమర్‌నాథ్‌ను శుక్రవారం కలిసి పాపా హోమ్ లోని వీధి బాలలతో దీపావళి సంబరాలు జరుపుకునేందుకు ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మంత్రి అంగీకరించారు. వారితో పాటు పాపా హోమ్‌కు వెళ్లి సంబరాలు జరుపుకొన్న అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. ఈ చిత్ర యూనిట్ అనేక కష్టనష్టాలకు ఓర్చి మారేడుమిల్లి తదితర అటవీ ప్రాంతాలలో అన్వేషి అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని నిర్మించిందని చెప్పారు. 


సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు కన్నా, పబ్లిసిటీకి ఎక్కువ ఖర్చు పెడుతున్న ఈ కాలంలో ఈ చిత్ర యూనిట్ అనాథ బాలలలో వెలుగు నింపడం కోసం పాప హోంలో చిన్నారులతో దీపావళి సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ చిత్రం విజయవంతం కావాలని కూడా మంత్రి అమర్నాథ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాపా హోం వార్డెన్ తదితరులు పాల్గొన్నారు.


గతంలో ప్రమాద బాధితులను ఆస్పత్రిలో చేర్చిన మంత్రి
గతంలోను మంత్రి అమర్‌నాథ్ తనలో మానవత్వాన్ని చాటుకున్నారు. బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన పినపోలు నాగేశ్వరరావు, అతని తమ్ముని కుమారుడు సంజయ్ బైక్ మీద విశాఖ వైపు వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న అల్యూమినియం రైలింగ్‌ ని ఢీ కొట్టింది. దీంతో కింద పడటంతో వీరిద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నాగేశ్వరరావుకు తలతో సహా పలు చోట్ల గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది. 


సంజయ్ అనే బాలుడు సుమారు 10 సంవత్సరాల వయసు ఉంటుంది. అతడికి కూడా తీవ్ర రక్తస్రావంతో రోడ్డు మీద పడి ఉన్నారు. ఆ సమయంలో మంత్రి అమర్నాథ్‌ అనకాపల్లి నియోజకవర్గంలో కార్యక్రమాలు ముగించుకుని విశాఖపట్నం వస్తుండగా.. రోడ్డు పక్కన రక్తమోడుతూ కనిపించిన వీరిద్దరిని చూసి.. వాహనం దిగి వెంటనే తన కాన్వాయ్ లో ఉన్న ఒక వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి, పోలీసుల సహాయంతో వారిని లంకెలపాలెం సీహెచ్సీకి తరలించారు.


 గాయపడిన ఇద్దరికి లంకెలపాలెం సీహెచ్సీలో ప్రాథమిక చికిత్స చేశారు. అక్కడి నుంచి రెండు అంబులెన్స్ లను కూడా ఆసుపత్రికి పంపించి క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంకు పంపించాలని వైద్యాధికారులను మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆదేశించారు. తీవ్ర గాయాలైన నాగేశ్వరరావు, సంజయ్ ప్రస్తుతం విశాఖ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు.