Maoists Letter to AP Minister: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అప్పలరాజుకు మావోయిస్టులు లేఖ రాశారు. పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో భూముల కబ్జా పెరుగుతోందంటూ లేఖలో పేర్కొన్నారు. భూ కబ్జాలో మంత్రి అప్పలరాజు ప్రమేయం ఉందంటూ ఏవోపీ స్పెషల్ జోన్ మావోయిస్టు కమిటీ పేరుతో ఓ లేఖ విడుదలైంది. మావోయిస్టు నుంచి లేఖ రావడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది.




మావోయిస్టు లేఖలో ఏముందంటే.. 


"అవినీతి, అక్రమాలతో వేల కోట్ల రూపాయలను పోగేసుకుని పుట్టినదే వైఎస్ఆర్‌సీపీ. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రజల భూములను ఆక్రమించుకోవడం ఒక విధానంగా మారిపోయింది. మూడు రాజధానుల పేరుతో తన అశ్రితులకూ, పార్టీ నాయకులకూ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దోచిపెట్టడానికి విశాఖ నగర చుట్టుపక్కల వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో కూడా నూతన జిల్లా కేంద్రాలలో ప్రజల భూములను వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను కూడగట్టుకున్నారు.


శ్రీకాకుళంజిల్లా పలాస మండలం, రామక్రిష్ణాపురంలో సర్వేనంబర్ 143/1లో గతంలో ప్రజలు పోరాడి సాధించుకున్న 30 ఎరకాల విలువైన భూములతోపాటు, దాని చుట్టుపక్కల ఉన్న రైతుల భూములను కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు దువ్వాడ శ్రీధర్, మంత్రి సీదరి అప్పలరాజు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కలిసి ఆక్రమించుకొని ఒక కార్పొరేట్ కంపెనీకి వేలకోట్ల రూపాయలకు ధారదత్తం చేస్తున్నారు. ఈ దురాక్రమణకు వ్యతిరేకంగా వేల మంది ప్రజలు పోరాడుతున్నా, అధికార బలంతో పోలీసు, రెవెన్యూ డిపార్ట్ మెంట్‌ అండదండలతో ప్రజలపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.


యూనివర్సిటీలో వ్యభిచార కార్యకలాపాలు..


ఈ ప్రాంత పరిధిలో కాశిబుగ్గ - పలాస జంట పట్టణాలకు అందుబాటులో ఉన్న సూదికొండ - నెమలికొండలు నేడు అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకొని కోట్ల రూపాయల విలువ చేసే మట్టినీ, రాళ్ళను యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. దాంతో తీవ్రంగా పర్యావరణం దెబ్బతిని నీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ భూములను కబ్జా చేయడంలో భాగంగా యూనివర్సిటీ ఆవరణ ప్రాంతంలో అరాచక కార్యకలాపాలు (వ్యభిచార) జరుగుతున్నాయని వాళ్ళ ఆటలు కట్టడి చేయడంలో భాగంగా చర్యలు చేపడుతున్నట్లు ప్రచారం చేసి పచ్చగా ఉన్న వందలాది చెట్లను నరికివేసి బుల్డోజర్ తో చదును చేయించారు.


పర్యాటక ప్రాంతమైన రుషికొండపై ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి అనేక అక్రమాలకు పాల్పడుతూ వస్తుంది. ఈ అక్రమాలను ఎవ్వరు ప్రశ్నించవద్దని ఏపీటీడీసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. టూరిజం పేరుతో అరకు ప్రాంతంలో అటవీ, రైతుల వేలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకొని రిస్టార్స్ నిర్మిస్తున్నారు. ఏపీఎఫ్పీసీ కాఫీ ప్లాంటేషన్ల విస్తరణలో భాగంగా రైతులు పోడు భూములను దురాక్రమిస్తున్నది. లాటరైట్ పేరుతో వేలాది ఎకరాల అడవులను ధ్వంసం చేయడంతోపాటు వాటి సరఫరాకు నాలుగు లైన్ల రోడ్లను నిర్మించి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు.


భవిష్యత్ పోరాటానికి సిద్ధం కావాలి..


అరకు లోయ మండలం, మాడుగుల గ్రామంలో ఎమ్ఎల్ఎ శెట్టి పాల్గుణ 'గడప గడపకు' కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తమ భూమి ఆక్రమణపై ఎమ్ఎల్ఎను నిలదీసిన గిరిజన కుటుంబంపై హత్యాయత్నం కేసు నమోదు చేసారు. పైన చెప్పిన విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలు సర్వసాధారణ అంశంగా మారిపోయాయి. పై దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎవ్వరు గొంతు విప్పినా జైళ్ళపాలు కావాల్సిందే. ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులనూ, ఆస్తులను పాలక వర్గాలు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న నేటి తరుణంలో ఆ పోరాట ఫలితాలను నిలుపుకోవడానికి పోరాటం, ప్రతిఘటన తప్ప మరో మార్గం లేదు. అధికార బలంతో అరాచకాలు సృష్టిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను మన ప్రాంతం నుంచి తన్ని తరిమి వేయాలి. గత పోరాట చరిత్రను నెమరవేసుకుంటూ భవిష్యత్ పోరాటానికి సిద్ధం కావాలి. దోపిడీ, అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న న్యాయమైన పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు తమ అండదండలు అందించాలని సీపీఐ (మావోయిస్టు) ఏఓబీ ఎస్జెడ్సీ పిలుపునిస్తుంది" అని లేఖలో పేర్కొన్నారు.