Vizag Steel Plant Privatisation: విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటు తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందేలా ఎన్టీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. తాము హామీ ఇచ్చినట్లుగానే నడుచుకుంటామని చెప్పారు. మన రాష్ట్రాన్ని నాశనం చేయాలని కోరుకునే బ్లూ మీడియా సృష్టించిన ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దని ఏపీ ప్రజలను నారా లోకేశ్ అభ్యర్థించారు.


“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై యు-టర్న్ తీసుకుంటుంది” అనే శీర్షికతో డెక్కన్ క్రానికల్ పత్రిక కథనాన్ని ప్రచురించడం పూర్తిగా కల్పితం. దీన్ని అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ఇది అశాంతిని సృష్టించడానికి, విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్‌ను నాశనం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం ప్రచురించిన క్లియర్ పెయిడ్ ఫిక్షన్ స్టోరీ.


విశాఖపట్నం స్టీల్ ప్లాంటు తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందేలా ఎన్టీఏ ప్రభుత్వం ఎటువంటి యూ టర్న్ తీసుకోదు. మేం హామీ ఇచ్చినట్లుగానే నడుచుకుంటాం. మన రాష్ట్రాన్ని నాశనం చేయాలని కోరుకునే బ్లూ మీడియా సృష్టించిన ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దని నేను ఏపీ ప్రజలను అభ్యర్థిస్తున్నాను.


డెక్కన్ క్రానికల్ వైజాగ్ కార్యాలయంలో వారి డిస్‌ప్లే బోర్డుపై జరిగిన దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరుతున్నాం. వారి భావోద్వేగాలను వారి చర్యలు అణచుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. పక్షపాతంతో కూడిన వార్తలను అందించే ఈ బ్లూ మీడియా సంస్థలపై మేం చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆ వార్తలు అస్సలు సరికానివి. అసంబద్ధమైనవి. వాస్తవాలు కానే కావు’’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.