2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో భోగాపురంలో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన జగన్ ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఉత్తరాంధ్రలో వచ్చి స్థిరపడేలా అభివృద్ధి జరగబోతోందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు మూడేళ్లలో పూర్తై విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఇక్కడ పునాది రాయి వేశాం.. మళ్లీ 2026లో మళ్లీ ఇక్కడికే వచ్చి ఇదే ప్రాజెక్టును ప్రారంభించబోతున్నాం. ప్రజల దీవెనులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఎవరూ ఏం చేయలేరన్నారు. 


భోగాపురంపై టీడీపీ హయాంలోనే ప్రక్రియ పూర్తై ఉంటే పనులు ఎందుకు సాగలేదని ప్రశ్నించారు జగన్. కోర్టుల్లో కేసులను పరిష్కరించుకుంటూ వచ్చామన్నారు. భూసేకరణ పూర్తి చేశామన్నారు. అన్ని అనుమతులు తీసుకొచ్చామని తెలిపారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఇవన్నీ కాకుండానే ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు మాత్రమే టెంకాయ కొట్టి వెళ్లిపోయారని చంద్రబాబును ఎద్దేవా చేశారు. మళ్లీ ఏ మాత్రం సిగ్గులేకుండా గతంలోనే శంకుస్థాపన చేశామని చెప్పుకోవడం దారుణమైన రాజకీయాలు ప్రపంచంలోనే ఎక్కడా ఉండబోవన్నారు. 


ఈ ప్రాజెక్టుల వల్ల లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు జగన్. 24 నెలల నుంచి 30 నెలల్లోపే పూర్తి అవుతుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విమానాశ్రయానికి అనుమతులు మంజూరు చేసిన ప్రధానికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించామన్నారు. 80 కోట్లతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మాణాలు చేపట్టామన్నారు. ఇవన్నీ నాలుగేళ్లలో పూర్తి చేసినట్టు తెలిపారు. 


అల్లూరి జన్మించిన పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను గుర్తు చేసుకోవాలని ప్రజలను కోరారు. ఆయన పేరుతో ఓ జిల్లా ఏర్పాటు చేశామన్నారు. ఆరు జిల్లాలుగా చేసి కలెక్టర్లను నియమించామన్నారు. ఉత్తారంధ్రలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను నిర్మించామన్నారు. త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. దశాబ్దాలుగా ఈ సమస్య ఉన్నా ఏ ఒక్కరూ చిత్తశుద్ధి చూపలేదన్నారు. ఆ సమస్య లేకుండా చేయాలని... ఇచ్చాపురం, పలాసకు హిరమండలం నుంచి తాగునీరు సరఫరా చేయబోతున్నామన్నారు. 700 కోట్ల రూపాయలతో చేపట్టే పైప్‌ లైన్ ప్రాజెక్టును ఈ జూన్‌లో శ్రీకాకుళం ప్రజలకు అంకితం చేస్తామన్నారు. 


ఉత్తరాంధ్ర ప్రజలు బాగా చదవాలని ఆలోచించి... కురుపాం ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ పనులు చేపట్టాం. పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజీ పనులు, నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ పనులు వేగంగా సాగుతున్నాయి. విజయనగరం మెడికల్ కాలేజీ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఉత్తరాంధ్రలో నాలుగు మెడికల్ కాలేజీలు, ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ కడుతున్నామన్నారు. ఈ మధ్య కాలంలోనే మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశామన్నారు. మరో మూడేళ్లలోనే అది పూర్తి కానుందన్నారు. ఇవాళ భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన చేశామన్నారు. ఆరులైన్ల రహదారి కోసం మరో నాలుగు నెలల్లో శంకుస్థాపన చేస్తున్నట్టు చెప్పారు. 


వీటన్నింటికి మించి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే కాపురం ఉండబోతున్నట్టు చెప్పారు జగన్. రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్న ఏ గ్రామం తీసుకున్నా కూడా ఏ ఇంటిని తీసుకున్నా, ఏ కుటుంబాన్ని తీసుకున్నా కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. పేదలకు మంచి జరగాలని, పేద మధ్య తరగతి వర్గాలకు అండగా నిలబడాలని అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ఈ 47 నెలల కాలంలో 2 లక్షల 10వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కుతుంటే మహిళల ఖాతాల్లో పడుతున్నాయన్నారు. గతాన్ని ఇప్పటికీ మధ్య తేడా గమనించాలని కోరారు జగన్. 


ఈ రాష్ట్రంలోని కోటీ యాభై లక్షల కుటుంబాలను పరామర్శించి ఈ పథకాలు అందాయా అని అడగ‌్గలను అన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేసిన వారిని కూడా అదే ఆప్యాయతతో అడగ‌్గలను అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలన కంటే మంచి జరిగిందని భావిస్తేనే తోడుగా నిలబడాలని నిజాయితీగా అడగ్గలుగుతున్నామన్నారు. ఏ సమాజిక వర్గాన్ని తీసుకున్నా ఇదే మాటను అడుగుతున్నాం. బడులకు వెళ్లే చిన్నారులను, మహిళలను, ముసలి వాళ్లను కూడా అదే అడుగుతున్నాం అన్నారు. తోడుగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.


మేనిఫెస్టో అంటే బుక్‌లు కొట్టి ఎన్నికల తర్వాత చెత్త బుట్టలో వేసే విధానం కాదన్నారు. 98.5 శాతం మేనిఫెస్ట్‌లో చెప్పినవి అమలు చేసి ఓ మతగ్రంథంగా భావించాం కాబట్టే తోడుగా నిలబడండీ అని చెప్పి అడుగుతున్నామన్నారు. ఇదే మాటను చంద్రబాబు అడగ్గలరా అని ప్రశ్నించారు. ప్రజలకు మొహం చూపించగలరా అని నిలదీశారు. 1995లో అధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచి... ఇదే చంద్రబాబు వల్ల ఈ 28 ఏళ్లలో మీ కుటుంబానికి జరిగిన మంచి ఏంటో చెప్పడానికి ఏమీ లేదన్నారు. 2019లో వచ్చిన జగన్ సీఎం అయ్యాక మీ కుటుంబానికి జరిగిన మంచి ఏంటో చెప్పగలుగుతున్నారన్నారు. 


ఏ మంచి చేయని చంద్రబాబుకు ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లకు ఓ దత్తపుత్రుడు తోడుగా ఉంటున్నారు. మరీ వీళ్లు ఎందుకు మద్దతు ఇస్తున్నారంటే... గతంలో ఇదే చంద్రబాబు హయాంలో బటన్స్ లేవు నొక్కేది లేదన్నారు. దోచుకో పంచుకో, తినుకో అన్నట్టు ఈ గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేశారన్నారు. అందుకే ఏం చేయని చంద్రబాబుకు వీళ్లంతా తోడుగా ఉన్నారని విమర్శించారు. 


జగన్ నమ్ముకున్నది దేవుడి దయ, ప్రజలను మాత్రమే అన్నారు. చంద్రబాబు మాత్రం ఎల్లో మీడియాను నమ్ముకున్నారని ఆరోపించారు. తను ధర్మాన్ని, సత్యాన్ని నమ్ముకుంటే చంద్రబాబు అబద్దాన్ని అసత్యాన్ని నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా మంచి చేస్తున్న ప్రభుత్వం ఒకవైపు ఉంటే... నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటూ దోచుకున్న వారంతా మరోవైపు ఉన్నారు. ఓవైపు పేదవాడి ప్రభుత్వం ఒకవైపు ఉంటే... మరోవైపున పెత్తందార్లకు మద్దతు తెలిపేవాళ్లు ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకోవాలని విజప్తి చేశారు.