CI Swarnalatha Gets Bail: విశాఖపట్నం: ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపిన నోట్ల మార్పిడి కేసులో అరెస్టయిన ఏఆర్‌ సీఐ స్వర్ణలతకి బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో కీలక నిందితురాలు సీఐ స్వర్ణలత సహా మొత్తం నలుగురికి విశాఖ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఇద్దరు జామీనుతో పాటు పూచీకత్తు సమర్పించాలని నిందితులను కోర్టు ఆదేశించింది. కొన్ని రోజుల కిందట నోట్ల మార్పిడి కేసు వెలుగులోకి రావడంతో సీఐ స్వర్ణలత వ్యవహారంపై డిపార్ట్ మెంట్ సీరియస్ అయింది.


అసలేం జరిగిందంటే.. 
నేవీ మాజీ అధికారులు శ్రీను, శ్రీధర్ తమ వద్ద ఉన్న త్వరలో వినియోగంలో ఉందని రూ.2 వేల నోట్లను మార్చుకోవాలని భావించారు. సూరిబాబు అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేశాడు. రూ.90 లక్షల విలువ చేసే రూ.500 నోట్లు ఇస్తే.. కోటి  రూపాయల విలువ చేసే రూ.2000 నోట్లు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు. నోట్ల మార్పిడిలో ఇబ్బందులు రాకుండా ఉండాలని ఏఆర్ సీఐ స్వర్ణలత వద్ద హోంగార్డులను ఆశ్రయించారు. హోంగార్డులు శ్యామ్ సుందర్, శ్రీనును ఆశ్రయించాక సీన్ రివర్స్ అయింది. నోట్ల మార్పిడి కేసులో బాధితులను బెదిరించి వారి వద్ద నుంచి రూ.12 లక్షలు డబ్బులు గుంజారు. దాంతో తాము మోసపోయామని గ్రహించిన నేవీ మాజీ అధికారులు విశాఖ సీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వర్ణలతతో పాటు మరో ముగ్గురు పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 


కొంత మంది కీలక వైఎస్ఆర్‌సీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు !


విశాఖ కమిషనర్ కార్యాయయంలోనే సీఐ స్వర్ణలత చాలా కాలం పని చేశారు. కమిషనర్ కార్యాలయం నుంచే పోలీసు పాలన  జరుగుతుంది కాబట్టి..ఆమె తన పోస్టును అడ్వాంటేజ్ గా తీసుకుని అన్ని పోలీసు స్టేషన్ల విషయాల్లోనూ జోక్యం చేసుకునేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతలతో స్వర్ణలత  మంచి సంబంధాలు కొనసాగించి..  సర్వీస్ పరంగా ఇబ్బందులు రాకుండా.. పోస్టింగ్‌ల లాబీయింగ్ కూడా చేస్తారని అంటున్నారు. ఆమె ఇలా బెదిరించి డబ్బులు దోపీడీ చేసిన విషయం బయటకు వచ్చిన తర్వాత ..  విశాఖలో ఓ కీలక ప్రజాప్రతినిధి ఆమెపై కేసు పెట్టకుండా ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. జిల్లా స్థాయిలో సాధ్యం కాకపోవడంతో.. రాష్ట్ర స్థాయి కీలక నేతతోనూ ఫోన్ చేయించారంటున్నారు. కానీ విషయం  బయటకు రావడంతో స్వర్ణలతపై కేసు పెట్టక తప్పలేదు. 


స్వర్ణలతపై సీరియస్‌గా విచారణ చేయగలరా ?


సాధారణంగా  పోలీసులు ఇలాంటి పనులు చేస్తే.. డిపార్టుమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. వెంటనే.. ఆమె ఇంతకు ముందు ఇలా ఎమైనా చేసిందేమో దర్యాప్తు చేస్తారు. కుుంబసభ్యులు, బంధువులు ఏమైనా అక్రమాస్తులు సంపాదించారేమో చూస్తారు. ఏసీబీ  మొత్తం..  ఆ పోలీసు అధికారి వ్యవహారాలన్నింటనీ బయటకు తీస్తుంది. అయితే ఇక్కడ సీఐ స్వర్ణలతపై తప్పని సరి పరిస్థితుల్లో..అదీ కూడా బయట కు తెలిసిందన్న  కారణంగా కేసు పెట్టారని.. అందుకే ఆమె ను ఏ 4గా పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. అంత సీరియస్ చర్యలేమీ ఉండవన్న అనుమానాలు ఎక్కువగా వ్యక్తవుతున్నాయి.  కంచే చేను మేస్తే..   ఇక ప్రజలకు ఎవరికి చెప్పుకుంటారు ? ఇలాంటి అధికారుల్ని కఠినంగా శిక్షిస్తేనే.. వ్యవస్థపై ప్రజలకు భరోసా ఉంటుందని లేకపోతే నమ్మకం కోల్పోతారన్న అభిప్రాయాలు సామాన్యుల నుంచి వస్తున్నాయి. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial