ఏపీలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ క్రికెట్ ఆడారు. విశాఖపట్నంలోని డీఎల్బీ గ్రౌండ్ లో ఆడుదాం ఆంధ్రా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో అమర్ లెవన్, కేకేఆర్ లెవన్‌ అనే జట్లు పోటీ పడ్డాయి. అమర్ లెవన్ అనే జట్టుకు కెప్టెన్ గా మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యవహరించారు. కేకేఆర్ లెవన్ జట్టుకు కెప్టెన్‌గా నార్త్ కో -ఆర్డినేటర్ కేకే రాజు వ్యవహించారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మంత్రి సహా కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఆడారు.


ఈ క్రికెట్‌ మ్యాచ్‌లో మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మెరుగైన ప్రదర్శన చూపారు. సిక్స్‌లు, ఫోర్లు బాదారు. మొత్తంగా 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేయగలిగారు. తన బ్యాటింగ్ లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో ఆకట్టుకున్నారు. కొన్ని సింగిల్ రన్స్ తీసి మొత్తం 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేశారు. మొత్తంగా అమర్ లెవెన్ వెర్సస్ కేకేఆర్ ఫ్రెండ్లీ మ్యాచ్ లో మంత్రి అమర్నాథ్ ఆసక్తికరమైన ఇన్నింగ్స్ ఆడారు. మంచి ఫుట్‌వర్క్‌తో ఆకట్టుకున్నారని వీక్షకులు అభిప్రాయపడ్డారు.


మ్యాచ్ అనంతరం మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ.. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను బయటకు తీయడానికి ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోందని అన్నారు. అందులో భాగంగా ఈ మ్యా్చ్ జరిగిందని అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఆడుదాం ఆంధ్రాను స్పోర్ట్స్ కార్యక్రమాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. కుల, మతాలకు అతీతంగా జరిగే క్రీడలపై దుష్ప్రచారం చేయడం తగదని అమర్ నాథ్ అభిప్రాయపడ్డారు. విమర్శలు చేస్తున్న టీడీపీ నాయకత్వం.. గత 14 ఏళ్ళు అధికారంలో ఉండగా ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టలేదని విమర్శించారు.


బైక్ ర్యాలీ ప్రారంభించిన అంబటి రాయుడు
అంతేకాకుండా.. విశాఖలో నిర్వహించిన ఈ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఆడుదాం-ఆంధ్రా స్పోర్ట్స్ మీట్ ఎన్ఏడీ జంక్షన్ నుంచి డీఎల్బీ గ్రౌండ్స్ వరకు వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్ నాథ్ కూడా బైక్ నడిపారు. క్రికెటర్ అంబటి రాయుడు ఆడుదాం-ఆంధ్రా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. క్రీడా నైపుణ్యాన్ని పెంపొందిస్తే.. విద్యార్థులకు ఆటల ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. ఆడుదాం ఆంధ్రాలో అనేక క్రీడలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ పెట్టించారని, రాష్ట్రం మొత్తం క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.