AP Minister Nara Lokesh sudden visit to Municipal School | విశాఖపట్నం: విశాఖపట్నంలో ఏపీ విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన ముగిసింది. తన పర్యటనలో భాగంగా శుక్రవారం సాక్షిపై పరువు నష్టం దావా కేసులో నారా లోకేష్ విశాఖ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేష్ శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. విశాఖపట్నం నెహ్రూ బజార్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలను నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా అంగన్వాడీ బాలల గదిని లోకేష్ సందర్శించారు. కొద్దిసేపు చిన్నారులతో మంత్రి సరదాగా గడిపారు. మీకు ఏం వచ్చు. ఎబిసిడి లు వచ్చా, రైమ్స్ వచ్చా అని అడిగారు. వారు నవ్వుతూ ఆడుతూ పాడుతూ లోకేష్ కు సమాధానాలు ఇచ్చారు. పిల్లలకు హైఫై ఇస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులకు చాక్లెట్లు పంచి, వారితో కలిసి మంత్రి లోకేష్ ఫోటోలు దిగారు. గుడ్లు, పౌష్టికాహారం సరఫరా, విద్యార్థులకు ఇవ్వడంపై టీచర్లను ఆయన ఆరాతీశారు. 


గ్రంథాలయం ఆకస్మిక తనిఖీ, కీలక నిర్ణయాలు
అంతకుముందు నెహ్రూ బజార్ ప్రాంతీయ గ్రంథాలయాన్ని మంత్రి లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 8 గంటలకు తెరవాల్సిన లైబ్రరీ 9.45 గంటలకు కూడా మూసివేసి ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల బలోపేతానికి మంత్రి లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ లైబ్రరీల  పర్యవేక్షణకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్ ను అధ్యయనం చేసి ఏపీలో  
పబ్లిక్ లైబ్రరీల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. 


Also Read: AP CM Chandrababu: 'విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం' - అమరావతి మీదుగా బుల్లెట్ రైలు కావాలన్న సీఎం చంద్రబాబు