విశాఖ జిల్లాలోని సబ్బవరం మండలంలో ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పైడివాడ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్టు చెప్పారు జిల్లాకలెక్టర్‌ మల్లిఖార్జున. 


ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయంలో  కలెక్టర్‌ మల్లిఖార్జున సమీక్ష నిర్వహించారు. పైడివాడ గ్రామంలో హౌసింగ్ పట్టాలకు సంబంధించిన లే అవుట్ సిద్దం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశం వద్ద మహిళలకు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని జివిఎంసి అధికారులకు సూచించారు. తాగునీరు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎండలు ఎక్కువగా ఉన్నందు వల్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆంబులెన్స్‌లు, మందులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య అధికారులకు ఆదేశించారు. పార్కింగ్ వద్ద సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి ఎస్ అధికారులకు ఆదేశించారు. సమావేశం వద్ద, హెలీప్యాడ్ వద్ద బ్యారికేడ్స్ ఏర్పాటు చేయాలని ఎస్ఇకి చెప్పారు. 


పైడివాడలో ఎంత మంది లబ్ధిదారులు ముఖ్యమంత్రి సమావేశానికి హాజరు కావాలో తెలియజేయాలని హౌసింగ్ పిడీని ఆదేశించారు జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున. పట్టా, గృహ మంజూరు పత్రాలు ముఖ్యమంత్రి చేతులు మీదుగా లబ్ధిదారులకు అందజేస్తారని పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి పథకాలపై లబ్ధిదారులు, ఖర్చులు, సంబంధిత వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెడీ చేయాలని విఎండిఎ అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్, హౌస్ సైట్‌లపై లబ్ధిదారులు మాట్లాడుతారని దానికి సంబంధించిన వివరాలు అందజేయాలన్నారు. హౌసింగ్ మంజూరు, స్టాల్స్, భోజన ఏర్పాట్లు, పార్కింగ్స్, తదితర అంశాలపై చర్చించారు. 


రానున్న రెండు రోజుల్లో అనకాపల్లి జిల్లా అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని డిఆర్ఓను ఆదేశించారు విశాఖ జిల్లా కలెక్టర్. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పట్టాల పంపిణీకి కౌంటర్లు ఏర్పాటు చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. ఇళ్ల పట్టాలు, గృహ మంజూరు పత్రాలు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అందుకు సంబంధించిన ఆర్డీవోలతో చర్చించాలన్నారు.  


ఈ మధ్య నిర్వహించిన వైసీపీఎల్పీలో మాట్లాడిన జగన్... నేతలంతా ప్రజల్లో ఉండాలని సూచించారు. ఇప్పుడు వారితో పాటు ముఖ్యమంత్రి కూడా ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ‌్లూ కరోనా కారణంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు వ్యాధి తీవ్రత పూర్తిగా తగ్గిపోవడంతో మళ్లీ తరచూ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. 


మంత్రి వర్గ విస్తరణ తర్వాత వచ్చి అసంతృప్తి స్వరాలు పూర్తిగా మూగబోయిన ఈ పరిస్థితుల్లో పార్టీ పటిష్టతపై జగన్ దృష్టి పెట్టారు. జిల్లా స్థాయి నేతలను కలవడం లేదన్న ఆరోపణలకు చెక్‌ చెప్పేలా... ఇలా జిల్లా టూర్లకు వెళ్లే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది.