Ayyanna Patrudu : వైసీపీ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ కు లూలూ కంపెనీ గుడ్ బై చెప్పిందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. లూలూ వస్తే 7 వేల మందికి ఉద్యోగాలు వచ్చేమన్నారు. సీఎం జగన్ వల్ల విశాఖ మెట్రో రాకుండా పోయిందన్నారు. అందుకే జగన్ ని ఉత్తరాంధ్ర ద్రోహి అంటామని, ఎవరైనా కాదంటారా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ దగ్గరికెళ్లి ఏం చేస్తావ్, కాళ్లు పిసికి వచ్చేస్తావా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆంధ్రాకు నష్టం చేస్తున్నారన్నారు. అందుకే జగన్ ని ఆంధ్రా ద్రోహి అని కూడా అనొచ్చని మండిపడ్డారు. అదానీకిచ్చిన భూమిలో 30 ఎకరాలు కొట్టేసి ఫ్లాట్ లేసి అమ్మేసుకుంటున్నారని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. మిలినియం టవర్స్ ని నిర్వీర్యం చేసేశారన్నారు. కర్నూల్ లో 670 కోట్లతో మెగా సీడ్ పార్క్ మంజూరు చేస్తామని, గౌతమ్ రెడ్డి కూడా మెచ్చుకున్నారని, కానీ జగన్ ఆపేయమని ఆర్డర్ వేశారని ఆరోపించారు. 


పెట్టుబడుల సదస్సులో తెల్ల చొక్కాలే ఎక్కువట 


"వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఇండస్ట్రీస్ ఎoదుకు పోయాయో చెప్పండి. విజన్ ఉన్న చంద్రబాబుకి జగన్ కి పోలికా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన చంద్రబాబుది. పెట్టిన పరిశ్రమలు పంపే ఆలోచన జగన్ ది. జగన్ తుగ్లక్ పరిపాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలయ్యింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో తెల్ల చొక్కాలు ఎక్కువుగా ఉన్నాయట. నాకు తెలిసి ఇన్వెస్టర్స్ కోట్లు వేసుకుంటారు. మరి తెల్ల చొక్కాలు వైసీపీ కార్యకర్తలు, నేతలు కావచ్చు." - అయ్యన్న పాత్రుడు 


పరిశ్రమలను తరిమేశారు


"గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో తెల్లచొక్కాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ సదస్సు పెట్టారు. దావోస్ లో ప్రతి సంవత్సరం పెట్టుబడుల సదస్తు జరుగుతోంది. అక్కడ చర్చ జరుగుతుంది. ప్రతి రాష్ట్రం అధికారులు, మంత్రులు వెళ్తారు. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నాలుగు సార్లు దావోస్ వెళ్లారు. సీఎం జగన్ నాలుగేళ్లలో దావోస్ కు ఒక్కసారే వెళ్లారు. అక్కడ ఏం చేశారో తెలియదు కానీ ఒక్క పరిశ్రమ రాలేదు. దావోస్ ఎందుకు వెళ్లడం అడిగితే .. అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది , అందుకే వెళ్లలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. చంద్రబాబు టైం ఏ పరిశ్రమలు వచ్చాయో రికార్డుగా చెప్పగలం. పరిశ్రమలు రావాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వాళ్లకు భూములు భూములు ఇవ్వాలి. ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమ పెట్టాలో చూడాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చాకా చాలా కంపెనీలు పారిపోయాయి. ప్రతీ వాళ్ల దగ్గర జే ట్యాక్స్. వాళ్లకు ఇచ్చిన భూములను కూడా ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు. ఏపీ నుంచి లూలూ కంపెనీని తరిమేశారు. ఈ కంపెనీ వచ్చి ఉంటే 7 వేల మందికి ఉపాధి దొరికేది"- మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు