100 Days Ruling In Andhra Pradesh: క్రికెట్‌ మంచి బ్యాటర్ అయితే వంద పరుగుల కోసం... సినిమాల్లో హీరో అయితే వంద రోజుల పండగ కోసం.... విద్యార్థి అయితే వంద మార్కుల  కోసం రాత్రి పగలు శ్రమిస్తారు. ఇప్పుడు ఈ జాబితాలోనే రాజకీయ నాయకులు కూడా చేరిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వందల రోజులు టార్గెట్‌గా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్డీఏ ప్రభుత్వం కూడా వంద రోజుల్లో చేసిన పనులను ప్రజల్లో చర్చకు పెట్టింది. అదే టైంలో వైసీపీ కూడా వంద రోజుల పాలనపై నెగిటివ్‌ ప్రచారం ప్రారంభించింది. 


ఇరు వర్గాల నుంచి పోటాపోటీగా సాగుతున్న మాటల యుద్ధంలో పక్కన పెడితే అసలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేశారో ఓసారి పరిశీలిద్దాం. తొలి వంద రోజుల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, ఫ్రీ ఇసుక పాలసీ, సామజిక పెన్షన్స్ 1000 పెంపు, పోలవరానికి 12500 కోట్లు, అమరావతికి 15000 కోట్లు లాంటి పనులను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. 


గతంలో జగన్ తన 100 రోజుల పాలనలో సామాజిక పెన్షన్స్ 250  పెంపు, రివర్స్ టెండరింగ్, ప్రజావేదిక కూల్చివేత, గ్రామ వాలంటీర్ల నియామకం వంటి పనులు చేపట్టిన అప్పట్లో సంచలనం సృష్టించారు. 


పూర్తిగా వివరాల్లోకి వెళ్తే... కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో మేము సాధించిన ఘనతలు ఇవి అంటూ ప్రచారం కూడా గట్టిగానే చేసుకుంటుంది. ఇదే సమయంలో గత ప్రభుత్వం అంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తన తొలి వంద రోజుల్లో ఏమేం చేశారు అనే కంపారిజన్ కచ్చితంగా వస్తుంది. ఆ పోలికనే చెప్పే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం.


కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో చేసింది ఇవే 
చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం గత 100 రోజుల్లో చేసిన ముఖ్యమైన పనులు ఇవి.


ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు 
ఈ ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం వల్ల తమ భూములు స్థలాలను ప్రభుత్వం లాగేసుకుంటుంది అనే ప్రచారం బలంగా వెళ్ళింది. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామంటూ కూటమి నేతలు హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం హోదాలో చంద్రబాబు ఆ యాక్ట్ రద్దు చేశారు. 


మెగా Dsc 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా సంతకాలు పెట్టిన మొదటి ఫైళ్ళలో మెగా డీఎస్సీ కూడా ఒకటి. 16 వేల ఉద్యోగాలను ఒకసారి ప్రకటిస్తూ చేసిన ఆ సంతకం నిరుద్యోగుల్లో బాగానే ప్రచారమైంది.


సామాజిక పెన్షన్ నాలుగు వేలకు పెంపు 
3000గా ఉన్న సామాజిక పెన్షన్ ను ఒకేసారి నాలుగు వేలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో పెండింగ్ లో ఉన్న మూడు నెలలకు కూడా ఈ పెంపును వర్తింపజేసి మొదటి నెలలో ఏకంగా 7000 చొప్పున లబ్దిదారులకు అందజేశారు.  


ఉచిత ఇసుక పాలసీ 
గత ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు తెచ్చిన వాటిలో ఇసుక పాలసీ కూడా ఒకటి. దానివల్ల ఇసుక రేట్లు పెరిగిపోయి భవన నిర్మాణరంగం,  కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇసుకను ఉచితంగానే ఇస్తామని చెప్పింది. కేవలం రవాణా చార్జీలు మాత్రమే వసూలు చేస్తుంది. ఇది మధ్య తరగతికి ఊరట కలిగించే అంశమే.


అమరావతికి జనామోదం 
2014- 19మధ్య అమరావతిపై ప్రజల్లో ఏకాభిప్రాయం కలిగించలేకపోయారు చంద్రబాబు. అయితే గత ఐదేళ్లుగా వైసిపి ఆడిన మూడు రాజధానుల ఆట అధిక భాగం జనాల్లో విసుగు తెప్పించింది. దానితో ఏపీకి రాజధాని అమరావతి మాత్రమే అనే భావం బలపడింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వానికి బలం పెరగడంతో కేంద్రం కూడా ఏపీకు కొంత అనుకూలంగా ఉంటోంది. సాయం అనుకోండి అప్పు అనుకోండి అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో 15 వేల కోట్లు కేటాయించారు. ఇది జనాల్లోకి బలంగా వెళ్ళింది.


పోలవరానికి 12500 కోట్లు 
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు మొదట్లో పెద్దగా కేంద్ర ప్రభుత్వం కలిసి వచ్చేది కాదు. అయితే ప్రస్తుత ఏపీ ప్రభుత్వం బలం వల్ల పోలవరం తొలి దశ నిర్మాణానికి 12500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదించింది. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్లో అతిపెద్దది.


గ్రామసభలు మొదలుపెట్టిన పవన్ 
ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ గ్రామ సభలకు తెర తీశారు. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి రికార్డ్ కూడా నెలకొల్పారు. అంతే కాదు ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లోకి ఈ కార్యక్రమం బాగానే చొచ్చుకు పోయింది. అలాగే పంచాయతీ రాజ్‌లో కొన్ని కీలక సంస్కరణలు తేవడానికి ఆయన కృషి చేస్తున్నారు. అటవీ శాఖలోనూ మార్పు తెచ్చేందుకు అడవుల సంరక్షణకు కీలక కార్యక్రమాలు రూపొందించారు.


విజయవాడ వరద సహాయక కార్యక్రమాల్లో చూపిన పట్టుదల 
200 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురవడంతో బుడమేరు కాలువ విజయవాడలో ముంచేసింది.10 రోజులపాటు సగం బెజవాడ నీళ్లలోనే ఉండిపోయింది. ఆ సమయంలో చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసి సహాయక కార్యక్రమాలను కొనసాగించారు. 70 ఏళ్లపైబడిన వయసులో వరదలో తిరుగుతూ బాధితులకు ధైర్యం చెప్పారు. వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఈ ఘటన కూడా ఏపీ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చి పెట్టింది 


అన్న క్యాంటీన్లు ప్రారంభం 
గతంలో తామే మొదలుపెట్టిన అన్న క్యాంటీన్‌లను చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. తొలి దశలో 100 నిన్న మరో 75 మొత్తం 175 అన్న క్యాంటీన్లు మళ్లీ తెరిపించింది. ఇది రోజువారి కూలీలకు సన్నకారు జీవులకు చాలా ఉపయోగపడే కార్యక్రమంగా మారింది.


సీఎంగా వంద రోజుల్లో జగన్ ఏం చేశారు 
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి తన తొలి 100 రోజుల పాలనలో కొన్ని ముఖ్యమైన పనులే చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


సామాజిక పెన్షన్‌లు 250 పెంపు 
ఎన్నికల ప్రచారంలో భాగంగా తానిచ్చిన హామీల్లో సామాజిక పెన్షన్ లను మూడు వేల వరకు పెంచుతానని. దాని ప్రకారమే ప్రమాణ స్వీకారం రోజున జగన్మోహన్ రెడ్డి తొలి సంవత్సరం 250 రూపాయలను పెంచి సామాజిక పెన్షన్లను 2250 చేశారు.


ప్రజావేదిక కూల్చివేత
అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉపయోగించిన ప్రజావేదికను నిబంధనలు ఉల్లంఘించి కట్టారంటూ దాన్ని కూల్చివేశారు. ఈ కార్యక్రమం అప్పట్లో సంచలనం సృష్టించింది. మొదట్లో దీనికి ప్రజల నుంచి ఆమోదం లభించినా ఐదేళ్లు పూర్తయ్యేసరికి జగన్ ప్రభుత్వానికి నెగిటివ్‌గా మారింది. కరకట్టపై ఉన్న ఇతర భవనాలను పట్టించుకోకపోవడంతో ప్రజా వేదిక కూల్చివేత రివెంజ్ పాలిటిక్స్‌లో భాగం అని ప్రచారం జరిగింది.


పోలవరంలో రివర్స్ టెండరింగ్
అప్పట్లో పోలవరం పనుల్లో అవినీతి, వృథా ఖర్చు ఎక్కువగా జరుగుతున్నాయంటూ రివర్స్ టెండరింగ్ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది వైసిపి ప్రభుత్వం.


గ్రామ వాలంటీర్ల నియామకం 
గ్రామాల్లో ప్రతి ఇంటికి పథకాలు అందేలా చూసేందుకు ఏర్పాటుచేసిన గ్రామ వాలంటీర్ల నియామకం జగన్‌ మోహన్ రెడ్డికి మంచి పేరే తెచ్చిపెట్టింది. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ అందుబాటులో ఉండేలా ఈ పథకం రూపుదిద్దుకుంది. క్రింది స్థాయి లబ్ధిదారులకు ఈ గ్రామ వాలంటీర్ల నియామకం చాలా కలిసి వచ్చింది.


Also Read: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?


ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ 
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన 100 రోజుల పాలనలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడం. క్షేత్రస్థాయిలో రోగులకు ఊరట కలిగించే నిర్ణయం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ కోసం పదివేల రూపాయలు సహాయం ప్రకటించడం జనంలో మంచి పేరు తెచ్చింది 


ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వ విలీనం చేస్తామంటూ ఇచ్చిన హామీని జగన్ నెర వేర్చే ప్రయత్నం చేశారు. సాంకేతిక కారణాలవల్ల ఏపీఎస్ఆర్టీసీ సంస్థను విలీనం చేయడం కుదరకపోవడంతో ఉద్యోగులను విలీనం చేసేందుకు ప్రక్రియ ప్రారంభించారు. వీటితోపాటు పోలీసులకు వీక్లీ ఆఫ్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చినా అమలులో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన అమ్మ ఒడి, నాడు నేడు, గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం లాంటి పథకాలకు రూపకల్పన చేసినా వాటి అమలు మాత్రం ఆ 100 రోజుల్లో జరగలేదు కాబట్టి వాటి గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు.


ఓవరాల్‌గా కూటమి ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం తమ తొలి వంద రోజుల్లో చేసిన పనుల్లో ముఖ్యమైనవి ఇవి. మరి ఇద్దరిలో పనితీరు ఎవరిది నచ్చిందో మీరే తేల్చుకోండి.


Also Read: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?