Vijayawada Police: ఏపీలోని విజయవాడలో వరద ప్రభావం నాలుగు రోజులుగా కొనసాగుతూనే ఉంది. నగరంలో ఇంకా చాలా ప్రాంతాలు, కాలనీల్లో వరద వల్ల వచ్చిన బురద నీరు ఇంకా అంతే నిలిచి ఉంది. దీనివల్ల ఇంకా జనజీవనం సాధారణ స్థితికి రాలేదు. కనీస అవసరాలైన ఆహారం, తాగు నీరు కూడా ఇంకా ఏపీ ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ఇళ్లలోకి కూడా నీరు చేరడం, విద్యుత్ లేకపోవడంతో ప్రజలు నాలుగు రోజులుగా అవస్థలు పడుతున్నారు. రోడ్లపైన, ఇళ్లలోకి వచ్చిన వరద నీరు, బురద పోయే వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. 


ఇలాంటి వరద పరిస్థితిలో ఓ మహిళ ప్రసవించింది. అలాంటి అత్యవసర పరిస్థితిలో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించేందుకు కూడా కుటుంబ సభ్యులకు ఏ అవకాశమూ లేదు. ఇంటి బయటకు వస్తే నడుము లోతు నీళ్లు ఉండడంతో ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ పోలీసులు తామే స్వయంగా వెళ్లి ఆమెకు సాయం చేశారు.


విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, డాబా కొట్ల సెంటర్ సమీపంలో ఓ మహిళ ప్రసవించగా సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా పడవలో అక్కడికి వెళ్ళారు. తల్లీబిడ్డను క్షేమంగా బయటకు తీసుకొచ్చి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. అప్పుడే పుట్టిన బిడ్డని సురక్షితంగా తీసుకుని వచ్చిన అధికార యంత్రాంగానికి ప్రజలు అభినందనలు తెలిపారు.