Vijayawada News: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దసరా ఉత్సవాల కోసం గతంలో ఇంజనీరింగ్ వర్క్స్ కు 2.5 కోట్లు ఖర్చు చేశామని ఇంద్రకీలాద్రి దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. పలు దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి దసరా కు వినియోగిస్తామని చెప్పారు. అలాగే పది రోజులకు కాంట్రాక్టు పద్ధతిలో కొంత మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదాన భవనం కూడా త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. 


15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు


అక్టోబర్‌ 15 వ తేదీన ఉత్సవాల తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనుంది. అలాగే 16వ తేదీన గాయత్రీ దేవి అలంకారంలో, 17న అన్నపూర్ణా దేవి అలంకారంలో అమ్మవారు ఇవ్వనున్నారు. 18న మహాలక్ష్మి దేవి, 19వ తేదీన మహాచండీ దేవి రూపంలో కనిపించనున్నారు. 20వ తేదీన శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 20వ తేదీ రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచీ 4 గంటల మధ్యలో సీఎం జగన్.. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 21వ తేదీన లలితా త్రిపురసుందరీ, 22వ తేదీన శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు కనిపించనున్నారు. ఇక చివరి రోజు అయిన 23వ తేదీన మహిషాసుర‌ మర్ధనీ దేవి అలంకారంలో అదే రోజు మధ్యాహ్నం నుంచీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో కనిపిస్తారు. 




భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఏర్పాట్లు..


ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరిగే ఊ శరన్నవరాత్రి ఉత్సవాలకు 200 మంది సిబ్బంది ఇతర దేవాలయాల నుంచి హాజరు అవుతారు. అన్ని శాఖల అధికారులు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తారు. కొండచరియలు జారిపడిన కారణంగా క్యూలైన్లు దుర్గాఘాట్ వైపు మార్చడం జరుగుతుందని ఇంద్రకీలాద్రి ఆలయ ఈఓ భ్రమరాంబ తెలిపారు. వినాయకుడి గుడి వద్ద నుంచీ క్యూలైన్లు ప్రారంభం అవతాయని.. ఎప్పటిలాగే ఐదు క్యూలైన్లు ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే కేశఖండన శాలకు 600 మంది సిబ్బంది ఉంటారని.. భక్తులు నిలిచే ప్రదేశాలను గుర్తించి షెడ్లు వేస్తున్నామని వివరించారు. జల్లు స్నానాలకు షవర్ లు, పది ప్రసాదం కౌంటర్లు, మోడల్ గెస్ట్ హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్ ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.


గతేడాది భక్తులు 16 లక్షల లడ్డూలు కొనుగోలు చేశారని.. ఈసారి 20 లక్షల లడ్డూలు తయారు చేయబోతున్నామని వివరించారు. అలాగే  మాలనక్షత్రం రోజున రూ.500 వీఐపీ టికెట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు.  వీవీఐపీల దర్శనం పై స్లాట్లు కూడా నిర్ణయిస్తామని ఆలయ ఈఓ భ్రమరాంబ తెలిపారు. ఉత్సవాల కోసం 7 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు.. గతంలో లాగానే భక్తుల రద్దీ ఆశిస్తున్నామని వివరించారు. దసరా 9 రోజులూ అంతరాలయ దర్శనం లేదని ఆమె స్పష్టం చేశారు.