అమాయకులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పేద మధ్య తరగతి వారికి పెద్ద ఎత్తున డబ్బు ఆశ చూపించి మోసాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్ల మాటలు నమ్మి దాచుకున్న మొత్తాన్ని, అప్పు చేసి మరీ వారి చేతిలో పెడుతున్నారు. మరి కొందరు తమకు ఉన్న కొద్దిపాటి బంగారం, వస్తువులను తాకట్టుపెట్టి డబ్బు తెచ్చి వారి చేతిలో పెట్టి మోసపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఎన్టీఆర్ జిల్లా కొండేపల్లిలో జరిగింది. యాప్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున లాభాలు పొందవచ్చని నమ్మించి ఏకంగా రూ.15 కోట్లకు టోకరా వేశాడో కేటుగాడు.


ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొద్ది నెలలుగా Maersk పేరుతో ఓ యాప్ విస్తృతంగా ప్రచారంలో ఉంది. కొండపల్లికి చెందిన కృష్ణ అనే యువకుడు బెంగళూరులో ఉండేవారు. ఈ యాప్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున లాభాలు సాధించవచ్చని కొండపల్లిలో విపరీతంగా ప్రచారం చేశాడు. అది నమ్మించడంతో కొండపల్లిలోని  కొన్ని కుటుంబాలు యాప్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాయి. కొంత కాలం పాటు డబ్బు విత్ డ్రా అయ్యేది. అది కూడా రూ.1500 నుంచి రూ.2000 వరకు మాత్రమే. అది నమ్మిన కొందరు రూ.40 వేల నుంచి రూ.1 లక్ష వరకు పెట్టుబడి పెట్టారు.


మొదట్లో అతా సవ్యంగా సాగడంతో కుటుంబ సభ్యులు, తెలిసిన వారితో యాప్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించారు. కొన్ని కుటుంబాల్లో అందరి పేరుమీద యాప్‌లో పెట్టుబడి పెట్టారు. ఇందులో కొందరు పరిస్థితి మరీ దారుణం. భార్య తాళిబొట్లు తాకట్టు పెట్టి యాప్‌లో ఇన్వెస్ట్ చేశారు. మరి కొందరు తమ జీవనాధారం అయిన ఆటోలను అమ్మడం, తాకట్టు పెట్టి డబ్బు పెట్టుబడి పెట్టారు. కాయకష్టం చేసుకుని జీవనం సాగించేవారు కొందరు. ఇలా వేల మంది నుంచి యాప్‌లో 15 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. కొద్ది కాలం పాటు వారికి చిన్న చిన్న మొత్తాల్లో విత్ డ్రాకు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత అసలు రంగు బయటపెడుతూ యాప్ పనిచేయకుండా చేశారు. 


దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబో దిబో మంటూ వాపోయారు. తమతో యాప్‌లో పెట్టుబడి పెట్టించిన యువకుడు కృష్ణకు ఫోన్ చేశారు. అతని స్విచ్ఛాఫ్ రావడంతో ఏం చేయాలో తెలియక బాధితుల్లో ఆందోళన మొదలైంది. బాధితులు వాడుతున్న యాప్‌లో ఉన్న కంపెనీ పేరు రహదారిపై  వెళ్తున్న ఓ కంటైనర్ వాహనం పై ఉండటాన్ని గమనించిన బాధితులు దాన్ని అడ్డుకున్నారు. డ్రైవర్‌ను నిర్బందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి వచ్చిన పోలీసులు కంటైనర్ డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం సీఐ పలివెల శ్రీను కేసు నమోదు చేశారు. అసలు ఈ కంటైనర్‌కు ఆ యాప్‌కు సంబంధం ఉందా ? లేదా అనే అంశంపై దర్యాప్తు చేపట్టారు. డబ్బు ఆశతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటూ ఎవరైనా చెబితే నమ్మొద్దని, ఇలాంటి యాప్‌లలో పెట్టుబడి పెట్టి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.