Amaravati News: అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 ఈ నెల 22-23వ తేదీల్లో అమ‌రావ‌తిలో జరగనుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే డ్రోన్‌ సమ్మిట్ వివరాలను పెట్టుబ‌డులు, మౌలిక స‌దుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఆదివారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను డ్రోన్స్ రాజధానిగా మార్చాన్న చంద్రబాబు ఆశయానికి అనుగణంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. మంగ‌ళ‌గిరిలోని సీకే కన్వెషన్‌లో 22న స‌ద‌స్సు ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించే సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె.రామ్మోహ‌న‌నాయుడు పాల్గొంటార‌ు. ఆయనతోపాటు పెట్టుబ‌డులు, మౌలిక‌స‌దుపాయ‌ల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇతర ప్రముఖులు హాజరవుతారు. 


డ్రోన్ టెక్నాల‌జీలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సాంకేతిక స‌దుపాయాలు, రోజువారీ జీవితంలో, అడ్మినిస్ట్రేషన్‌లో ఎదుర‌వుతున్న సమస్యల ప‌రిష్కారానికి డ్రోన్స్‌ను ఎలా ఉప‌యోగించాల‌నే దానిపై ఈ స‌ద‌స్సులో చర్చ జరుగుతుంది. డ్రోన్ అప్లికేష‌న్స్‌కు సంబంధించి ఏం చేయాల‌నేదానిపై ఒక ప్రణాళిక రూపొందించనున్నారు. డ్రోన్ ద్వారా ఒక వీడియో రికార్డు చేసినప్పుడు దాని అన‌లిటిక‌ల్స్ ఇప్పుడు స‌రిగ్గా ఎక్కడా చేయ‌డం లేద‌ని ఈ అంశాన్నిపై కూడా మాట్లాడనున్నారు. వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు అక్కడ ఎంత మేర నీరు ఉంది, నీటి లోప‌ల ఏముంది, ఎంత మంది చిక్కుకు పోయారు, పురుషులెందరు, మ‌హిళ‌, చిన్నారు ఎంత మంది ఉన్నారోలాంటి విశ్లేష‌ణ సామ‌ర్థ్యం అందుబాటులోకి రాలేద‌ు. ఇలాంటి సమస్యలపై ముంబయి, మ‌ద్రాస్‌, తిరుప‌తి ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో డ్రోన్ కార్పొరేష‌న్ అధ్యయనం చేసి ఒక ప‌రిష్కారం తీసుకొచ్చే దిశ‌గా ప‌ని చేయనుంది. 


అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌కు దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజ‌ర‌వుతార‌ని  తెలిపారు. 400 మంది డ్రోన్స్ రంగంలో అనుభ‌వమున్న సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు కూడా పాల్గొంటారు. యూనివర్శిటీ అధ్యాపకులు, విద్యార్థులు వస్తారు. 


5 వేల డ్రోన్స్‌తో షో
స‌ద‌స్సులో భాగంగా 22వ తేదీ సాయంత్రం కృష్ణా న‌ది తీరంలో భారీ ఎత్తున డ్రోన్ షో నిర్వహిస్తారు. ఇప్పటి వ‌ర‌కు దాదాపు 2500 డ్రోన్లతోనే ఇలాంటి ప్రదర్శన చేశారని ఇప్పుడు అంత‌కు రెట్టింపు డ్రోన్స్‌తో షో చేస్తున్నారు.  ఈ షోను చూసేందుకు ప్రజలందరూ తరలి రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఫస్ట్ టైమ్ ఏపీలో ఇంతటి ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహిస్తున్నామని విజ‌యవంతం చేయ‌డానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరింది. 


"హ్యాక‌థాన్ " లో పాల్గొనండి... ప్రైజ్ మనీ ఎంతంటే ?
డ్రోన్ స‌మ్మిట్ సంద‌ర్భంగా ఔత్సాహికుల కోసం డ్రోన్ హ్యాక‌థాన్ నిర్వహిస్తున్నారు. హ్యాక‌థాన్‌లో పాల్గొనాలని ఉత్సాహం చూపేవాళ్లు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఏపీ డ్రోన్ కార్పొరేష‌న్ ఛైర్మన్‌ అండ్ ఎండీ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు ఔత్సాహికులు తుది గడువు ఉంది. 20వ తేదీలోపు రివ్యూ చేసి విజేత‌ల‌ను ఎంపిక చేస్తార‌ు. ఫస్ట్ ప్రైజ్ 3 లక్షలు, రెండో ప్రైజ్ 2 లక్షలు, థర్డ్ ప్రైజ్ 1 ల‌క్ష న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తారు. ఈ బ‌హుమ‌తుల‌ను స‌ద‌స్సు ప్రారంభోత్సం  రోజున ముఖ్యమంత్రి అందజేస్తారు. ఔత్సాహికులు https://amaravatidronesummit.com/ వెబ్‌సైట్‌లో త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌ని కోరారు. 


లోగో ఆవిష్కరణ 
అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024కు సంబంధించిన లోగో, డ్రోన్ హ్యాక‌థాన్‌కు సంబంధించి లోగోలు, స‌ద‌స్సు ఆహ్వాన ప‌త్రిక‌ల‌ను అధికారులు ఈ స‌మావేశంలో విడుద‌ల చేశారు.


Also Read: ఎలాంటి హామీ లేకపోయినా మీ వ్యాపారం కోసం రూ.20 లక్షల లోన్‌ - ఎలా దరఖాస్తు చేయాలంటే?