పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలంలో దారుణం జరిగింది. అనుపు చెంచు కాలనీ గ్రామానికి చెందిన ఆశావర్కర్‌పై ముగ్గురు వ్యక్తులు హత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని స్థానిక నాయకులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. 


బాధితులకు అండగా ఉండటమే కాకుండా వారికి న్యాయం జరిగేలా నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి  నిందితుల కోసం గాలిస్తున్నారు.


మరోవైపు బాధితులకు అండగా ఉండాలన్న ఆదేశాలతో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం పది లక్షల రూపాయల చెక్‌ను బాధితురాలి ఫ్యామిలీకి అందజేశారు. 


శుక్రవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు మహిళపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఇది స్థానికంగా సంచలనంగా మారింది. ఘటన జరిగిన వెంటనే విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేశారు స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిని  ఆదేశించారు. 


మృతురాలు ఆశావర్కర్‌గా పని చేస్తుంటే... ఆమె కుమార్తె గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.