Andhra Pradesh: సీఎం చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి బలమని పునరుద్ఘాటించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కలిసి పోటీ చేసినందుకు ఇప్పుడు మంచి పనులు జరుగుతున్నాయని ప్రజలకు తెలియజేశారు. ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లభించి రాష్ట్రాభివృద్ధి జరగాలనే సంకల్పంతో టీడీపీతో కలిసి పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె పండగ వారోత్సవాలను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కృష్ణా జిల్లా కంకిపాడులో ప్రారంభించారు. 


కంకిపాడులో ప్రారంభోత్సవం


కంకిపాడు మండల పరిధిలోని పలు అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేశారు. కంకిపాడులో రూ.95.15 లక్షల అంచనా వ్యయంతో 11 అంతర్గత సిమెంటు రోడ్ల నిర్మాణం చేయనున్నారు. రూ. 54 లక్షల అంచనా వ్యయంతో పునాదిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కాంపౌండ్ వాల్ నిర్మించనున్నారు. రూ.52 లక్షల విలువైన రెండు అంతర్గత సిమెంటు రోడ్లు వేయనున్నారు. ఈ పనులకు సంబంధించిన శిలాఫలకాలు పవన్ ప్రారంభించారు. 


అదే లక్ష్యంతో పని చేశామన్న పవన్


రాష్ట్రం బాగుండాలనే ఏకైక ఆకాంక్షతో మూడు పార్టీలు జత కట్టి పోటీ చేస్తామన్నారు పవన్ కల్యాణ్. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలియజేశారు. ప్రజలు బాగుండాలి, యువతకు ఉపాధి దొరకాలి, పల్లెల్లో వెలుగులు నిండాలన్న లక్ష్యంతో ఎన్నికల్లో పని చేశామన్నారు. బలమైన నాయకత్వం వల్ల రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని తెలిపారు. 


తనకు చంద్రబాబు ఆదర్శమన్న పవన్


తనకు పాలనలో చంద్రబాబే ఆదర్శమన్నారు పవన్ కల్యాణ్. ఆయన స్ఫూర్తితోనే రాష్ట్రాభివృద్ధి కోసం ప్రణాళికలు వేస్తున్నట్టు పేర్కొన్నారు. ముందు ఒకేరోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించామని అందులో వచ్చిన ఫీడ్‌ బ్యాక్ ఆధారంగానే ఇప్పుడు పనులకు శంకుస్థాపన చేస్తున్నట్టు వెల్లడించారు. ఇలా జరగడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి అని అభిప్రాయపడ్డారు పవన్ కల్యామ్. ఇప్పటికే పనులకు పరిపాలన, సాంకేతిక ఆమోదం లభించిందని తెలిపారు. రూ.4,500 కోట్ల నిధులతో చేస్తున్న పనులకు డిస్‌ప్లే బోర్డులు కచ్చితంగా ఉండాలన్నారు. దాపరికం లేకుండా అన్ని వివరాలు అందులో కనిపించాలని స్పష్టం చేశారు. 


తాము ఎంత పారదర్శకంగా ఉన్నప్పటికీ.. వ్యవస్థలో కూడా అధికారులు బాగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐ.ఎఫ్.ఎస్ అధికారి నా పేరు చెప్పి డబ్బులు అడిగి సంగతి తన దృష్టికి వచ్చిందన్నారు పవన్ కల్యాణ్. వచ్చిన వెంటనే విచారణ చేసి, అవసరమైతే సస్పెండ్ చేయాని ఆదేశించినట్టు చెప్పారు. అవినీతి అధికారులు తమకు వద్దన్నారు. ఎవరు లంచం పేరుతో ఇబ్బంది పెట్టినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పరిపాలన ఎలా చేయాలనే అంశంలో తనకు చంద్రబాబునాయుడు స్పూర్తి అని చెప్పుకొచ్చారు. క్యాబినెట్ సమావేశాలలో చంద్రబాబు చాలా బలంగా మాట్లాడతారని గుర్తు చేశారు. అధికారులు లేవనెత్తే సందేహాలకు కూడా చంద్రబాబు చెప్పే సమాధానాలు ఆశ్చర్యం కలిగిస్తాయన్నారు.ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకు చిత్తశుద్ది ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. 


అధికారుల్లో కూడా మార్పు రావాలి: పవన్


పాలకుంలు ఎంత పారదర్శకంగా ఉన్నప్పటికీ అధికారులు కూడా అంతే పారదర్శకంగా ఉండాలని సూచించారు పవన్ కల్యాణ్. వ్యవస్థలో వ్యక్తులు బలంగా ఉండాలని... ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. అందుకే లంచాల ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. 'పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల పరిధిలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ. 4,500 కోట్ల నిధులతో 30 వేల అభివృద్ధి పనులు ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఈ పనులు పూర్తి చేస్తారు. గ్రామాల్లో 3 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 25,000 గోకులాలు, 10 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ ట్రెంచులు లాంటివి నిర్మించనున్నారు.పల్లె పండుగ కార్యక్రమ ప్రారంభోత్సవానికి కంకిపాడు వచ్చిన పవన్‌కి జనసేన శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. రహదారికి ఇరువైపులా ఉన్న భవనాలపై నుంచి వాహన శ్రేణిపై పూల వర్షం కురిపించారు. 


Also Read: ఆకాశంలో అద్భుతం - 80 వేల ఏళ్ల క్రితం అరుదైన తోకచుక్క ఫోటోలు చూశారా?, ఏపీలోని తిరుపతిలో..