Chandrababu gives clarity over union govt assistance to AP And Telangana | అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణకు రూ.3,300 కోట్ల సాయం ప్రకటించిందని ప్రచారం జరిగింది. వరదలపై కేంద్రం సాయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఎందుకంటే, ఇప్పటివరకూ ఏపీలో వరద నష్టంపై కేంద్రానికి నివేదిక పంపించలేదని చంద్రబాబు తెలిపారు. విజయవాడ వరదలపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో సంభవించిన వరద నష్టంపై నివేదిక తయారుచేశాం, శనివారం ఉదయం (సెప్టెంబర్ 7న) కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదిక పంపుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.


శుక్రవారం బుడమేరు, కృష్ణా పరివాహక ప్రాంతంలో చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. బుడమేరుకి పడిన గండిని పూడ్చే పనులు ముమ్మరం చేశాం. ఇప్పటికే ఆర్మీ కూడా వచ్చిందని, శనివారం నాటికి మూడో గండి పూడ్చే విధంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ‘బుడమేరు బ్రిడ్జి క్లోజ్ చేయాలి. దానివల్ల వచ్చే నీరు ఆగుతుంది. అప్పుడే పనులు సులువుగా చేయవచ్చు. ఆరోరోజు నిర్విరామంగా పనిచేసినా, మళ్లీ వర్షం కారణంగా నీటి ఫ్లో పెరిగింది. దాంతో కొన్ని ప్రాంతాల్లో నీటి పరిమాణం పెరిగింది. చాలా శ్రమించి, సర్వశక్తులు ఒడ్డి.. ఓ మంత్రి, ఆర్మీ మూడో గండి పూడ్చే పనుల్లో బిజీగా ఉన్నారు. 


7100 మంది సానిటేషన్ వర్కర్స్ 24 గంటలు పని చేస్తున్నారు. 12 వేల మెట్రిక్ టన్నుల వేస్ట్ ని డిస్పోజ్ చేశాం. 458 కిలోమీటర్ల రోడ్డు క్లీన్ చేపించాం. 110 ఫైర్ ఇంజిన్లు పనిచేస్తున్నాయి. 10 వేల టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికీ 4వేల ఇండ్ల పని పూర్తయింది. విద్యుత్ ను తిరిగి తీసుకొచ్చాం. షార్ట్ సర్క్యూట్ అవుతుందన్న కారణంగా కొన్ని ఇండ్లకు విద్యుత్ ఇవ్వడం లేదు. 160 మెడికల్ క్యాంపులు పెట్టి, 54 వేల మంది వరకు ట్రీట్మెంట్ అందించాం. 



681 వాహనాలు పని చేస్తున్నాయి. బస్సులు, ట్రాక్టర్లు, జేసీబీలు గ్రౌండ్ లెవల్ పని చేస్తున్నాయి. ఇవి కాకుండా 1300 ఇతర వాహనాలు, పవర్ బోట్లు సైతం 28 మంది చనిపోయారని నిర్ధారించాం. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించాం. పాలు, వాటర్ బాటిళ్లు, బిస్కట్లు 3వేల మందికి ఈరోజే ఇచ్చాం. చిన్న చిన్న పనులుంటే బయటకు వెల్లడానికి ఫ్రీ బస్సులు ఏర్పాటుచేశాం. మూడు రోజుల్లో ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం నిత్యావసర వస్తువులు ఇచ్చే విధంగా చూస్తున్నాం.


ఈ నిత్యావసర వస్తువులు ఇచ్చిన రోజు, డ్రై ఫుడ్ కింద, మరో కిట్ కూడా ఇస్తాం. ఈ ప్యాకేజి మీకు వచ్చే వరకు, ఆహారం కూడా సరఫరా చేస్తాం. కుటుంబానికి 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కర, 1 లీటర్ పామాయిల్, 2 కేజీల బంగాళాదుంపలు, 2 కేజీల ఉల్లిపాయలు అందిస్తున్నాం. చిన్నాపెద్దా వ్యత్యాసం లేకుండా అందరికీ ఇవి ఇస్తున్నాం. ప్రకృతికి ఏ తేడా లేకుండా అందరి మీద ప్రభావం చూపించింది. ప్రజలు ఇచ్చే ఫీడ్ బ్యాక్ బట్టి అప్పటివరకూ ఫుడ్ అందిస్తామని’ ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.



నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ ప్రారంభం
వరద బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులైన బియ్యం, కందిపప్పు, చక్కెర, పామాయిల్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. మధురా నగర్ లో ముంపు బాధితులను పరామర్శించిన అనంతరం సింగ్ నగర్ లో 6 పదార్ధాలతో కూడిన కిట్ ను ప్రజలకు సీఎం చంద్రబాబు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Also Read: Vijayawada Floods: విజయవాడ వరదలు - కరెంట్ బిల్లుల చెల్లింపుపై ఉపశమనం, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు