Vijayawada News : ఈ ఏడాది బెజవాడలో మొత్తంగా 9 కోట్ల విలువ గల ఆభరణాలు, నగదు, ఇతర వస్తువులు చోరీ జరిగితే అందులో 8 కోట్ల రూపాయల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నామని సీపీ క్రాంతి రాణా టాటా వెల్లడించారు. అంతే కాదు గత ఏడాదితో పోల్చితే 13 శాతం  నేరాలు తగ్గాయని ఆయన చెప్పారు. 2022లో  బెజవాడ పోలీస్ కమిషనరేట్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఏకంగా జిల్లా స్థాయిలో బెజవాడ కమిషనరేట్ రూపాంతరం చెందింది. గుంటూరు, విజయవాడ నగరాలను కలిపి అమరావతి పోలీస్ కమిషనరేట్ గా రూపాంతరం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే జిల్లా విభజనతో బెజవాడ పోలీస్ కమిషనరేట్ పరిధి జిల్లా ఎస్పీకి పరిమితం అయ్యింది. ఈ ఏడాదిలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో 270 చోరీ కేసులు నమోదు అయ్యాయని సీపీ క్రాంతి రాణా టాటా తెలిపారు. లోక్ అదాలత్ లలో చాలా కేసులు సెటిల్ అయ్యాయని, ఆయన వెల్లడించారు. 9 కోట్ల రూపాయలు చోరీకి గురికాగా 8 కోట్ల రూపాయలు రికవరీ చేసినట్లు వెల్లడించారు.


మర్డర్ కేసులు ఎన్నంటే 


జిల్లాలో మెత్తం మీద 41 మర్డర్ కేసులు నమోదు అయ్యాయని, గతంతో పోల్చితే 10 శాతం మర్డర్ కేసులు తగ్గాయని క్రాంతి రాణా టాటా స్పష్టం చేశారు. దిశ యాప్ ను ప్రజలకు చేరువ చేసే విషయంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ముందు వరుసలో ఉన్నారని, ప్రతి ఒక్కరి మొబైల్స్ దిశ యాప్ ను  ఇన్స్టాల్ చేయించాలని చెప్పారు. ఇక ఫోక్సో కేసుల విషయానికి వస్తే ఎక్కడ రాజీ పడకుండా బాధితులకు న్యాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ముందకు వెళ్లామని అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా, 73 ఫోక్సో కేసులు నమోదు చేసి బాధితులకు అండగా నిలిచామని వెల్లడించారు.


మిస్సింగ్ కేసులు 


మిస్సింగ్ కేసులు నమోదు విషయంలో కూడా పోలీసులు రాజీపడకుండా పనిచేశారని, మహిళలు, చిన్నారులు, పిల్లలు  మిస్సింగ్  లపై ఫిర్యదులు వస్తే వెంటేనే స్పందించి చర్యలు తీసుకోవటంతో చాలా ఫలితాలు వచ్చాయని అన్నారు. కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేసే విధంగా  వెంటనే దర్యాప్తు వేగవంతంగా చేసినట్లు చెప్పారు.


రోడ్డు ప్రమాదాల్లో 


జిల్లాలో రోడ్డు ప్రమాదాలు మూడంకెలు దాటాయి. ఏడాది కాలంలో 374 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు మరిన్ని చర్యలు చేపట్టినప్పటికి మితిమీరిన వేగం, కారణంగా ప్రమాదాల సంఖ్య పెరిగింది. వీటితో పాటుగా 159 సైబర్ కే సులు నమోదు అయ్యాయని, లోన్ యాప్ బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తే అండగా ఉంటమన్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో పాటు గంజాయిని దగ్ధo చేశామని, అక్రమ మద్యం తరలించే వారిపై ఉక్కుపాదం మోపామని ఎస్పీ క్రాంతి రాణా టాటా చెప్పారు.


డ్రంక్ అండ్ డ్రైవ్ లో 


డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పోలీసులు ఈ ఏడాది కఠినంగా వ్యవహరించారు. పలుకుబడితో ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై  కేసులు నమోదు చేశామని అన్నారు. అంతే కాదు నగరంలో అల్లరలకు ,గొడవలకు కారకులు అవుతున్న 14 మంది రౌడీ షీటర్ లను కూడా గుర్తించి వారిని  నగర బహిష్కరణ చేశారు. శివారు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేస్తున్నామని, బ్లేడ్ బ్యాచ్, గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారిపై  నిఘా ముమ్మరం చేయటంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉత్తమ ఫలితాలను సాధించారని ఎస్పీ వెల్లడించారు.