Ganesh Chaturdhi 2022 :  ఆగ‌స్టు 31న జరగనున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరంలో వినాయక పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని నగర పోలీసులు ప్రక‌టించారు. అనుమతి కోసం సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న సమీకృత పోలీస్ సేవా కేంద్రం (UPSC)లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. సమర్పించిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన త‌రువాత‌ అనుమతులు మంజూరు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమీకృత పోలీస్ సేవా కేంద్రం పనిచేస్తుంద‌ని, మున్సిపల్, పంచాయతీ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ శాఖ నుంచి ముందుగా పొందిన అనుమతి పత్రాలతో పాటు  అన్ని వివరాలు ఉన్న అర్జీని అందించాలని పోలీసులు వెల్లడించారు. పండుగ రోజు నుంచి జరిగే ఈ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరుగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తగా పాటించాలని పోలీస్ క‌మిష‌నర్ కాంతి రాణా టాటా తెలిపారు.


నియమ నిబంధనలు, ముందస్తు జాగ్రత్తలు 


వినాయక "విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళను" ఏర్పాటు చేసుకోవడానికి, ఊరేగింపునకు తప్పని సరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. వినాయక చవితి పందిళ్ళ ఏర్పాటుకు ముందుగా మున్సిపాలిటీ, ఫైర్, ఎలక్ట్రికల్ పంచాయతీ శాఖల అనుమతి(NOC) పొందిన తరువాత మాత్రమే పోలీస్ శాఖ అనుమతి పొందాల్సి  ఉంటుంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పోలీస్ అధికారిని మిగతా అన్ని శాఖలు మండపాల ఆర్గనైజింగ్ కమిటీ వారితో సమన్వయకర్తగా వ్యవహరించడానికి నియమించనున్నారు. ఆర్గనైజింగ్ కమిటీ వారికి ఏవిధమైన సమస్య, సందేహాలు వచ్చినా ఈ సమన్వయ అధికారిని గానీ, ఆ ఏరియా పోలీస్ స్టేషన్ లో  గానీ, లేక డయల్ 100 సంప్రదించాలని పోలీసులు సూచించారు.  మండపాల వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ, నియంత్రణ నింబంధనలు-2000 ప్రకారం రెసిడెన్సియల్ ఏరియా నందు పగలు 55, రాత్రి 45 డెసిబల్స్ కు మించకుండా ఉండే విధంగా స్పీకర్లను ఉపయోగించాలని సూచించారు. 


రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు స్పీకర్లు బంద్ 


లౌడ్ స్పీకర్లను సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి స్పీకర్లను  ఎట్టిపరిస్థితులలోను ఉపయోగించరాదు. విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం, విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియజేయాలి.మండపాలలో దీపారాధనల వలన అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రతలు తీసుకోవాలి. విద్యుత్ వైర్లను ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రతలు వహించాలి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలి. భద్రత కోసం రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలి. మండపాల వద్ద ఏ విధమైన అగ్ని ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు నీరు, ఇసుకను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పందిరి వద్ద నిర్వహకులు సి.సి.టి.వి కెమెరాలు ఏర్పాటు, 24/7 సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. మండపం పటిష్టతను దృష్టిలో ఉంచుకుని పూజ నిర్వహించే సమయంలో మండపంపై ఎక్కువ మంది జనం లేకుండా చూడాలి. 


ఫ్లెక్సీలు రోడ్డుపై పెట్టరాదు 


విగ్రహ పందిళ్ళ చుట్టుప్రక్కల వాహనాలను పార్కింగ్ చేయరాదు. పందిళ్ళకు దూరంగా పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలి. వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశం గాని రోడ్డుపైన ఉండరాదు. బ్యానర్లు కానీ, ఫ్లెక్సీలు రోడ్డుపైన పెట్టరాదు. వినాయక పందిళ్ళ వలన ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించరాదు.ఊరేగింపు సమయంలో ఇతర కులాలు, మతాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ప్లకార్డులు బ్యానర్లు ప్రదర్శించడం చేయరాదు. అలాగే ఊరేగింపుతో పాటు వెళ్లే మతనాయకులు వేరే మతాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వకుండా మత సామరస్యం పాటించాలి. ఆయా పరిసర ప్రాంతాల్లో అనుమానిత కొత్త వ్యక్తుల సమాచారం గురించి గానీ వదలి వేసిన వస్తువుల గురించి గానీ ఉత్సవ నిర్వాహకులు వెంటనే పోలీసు వారికి తెలియజేయాలి.


అర్జీదారుడిదే బాధ్యత 
 
విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో రంగులు చల్లడం, లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం, మందుగుండు సామాగ్రిని పేల్చడం చేయరాదు. ఊరేగింపు సమయంలో పోలీసుల అనుమతి లేకుండా వేషధారణలు ఎక్కువ శబ్ధం వచ్చే వాయిద్యాలు అనగా డీజే అనుమతించరాదు. పందిళ్ళ వద్ద ఊరేగింపు సమయాలలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నాట్య ప్రదర్శనలు జరగకుండా  మద్యం లేదా మత్తు పదార్ధాలను సేవించిన వారు లేకుండా ఉండే విధంగా ఉత్సవ నిర్వాహకులు బాధ్యత వహించాలి. ప్రజల సౌకర్యార్ధం సీతమ్మ వారి పాదాల వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. విగ్రహ ఊరేగింపు సమయంలో భారీ వాహనాలు పెట్టరాదు. లారీల పైగాని ట్రాలీలపైగాని ఆర్కేస్ట్రాలను వినియోగించరాదు. ఊరేగింపు సమయంలో కర్రలు, ఇతర ఆయుధాలు ధరించి పాల్గొనరాదు. నిమజ్జన ఊరేగింపునకు  అనుమతించిన సమయం, రూటు కచ్చితంగా పాటించవలెను. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు భద్రత కోసం తగినంత మంది వాలంటీర్లను ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అర్జీదారుడు కార్యనిర్వాహకులు బాధ్యత వహించాల్సి ఉంటుంద‌ని పోలీస్ క‌మిష‌నర్ ప్రక‌టించారు.