AP Telangana Latest News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్లతో 12 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనుంది. ఈ పార్కులు కొన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు కానుండగా ఆ జాబితాలో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. ఈ భారీ ప్యాకేజీని కేంద్ర మంత్రివర్గం త్వరలోనే ఆమోదించనున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బిహార్, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, ఇతర ప్రాంతాల్లో కొత్తగా ఈ పారిశ్రామిక పార్కులను కేంద్రం ఏర్పాటు చేయబోతోంది.


కేంద్ర మంత్రివర్గం తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక పురోగతిని గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇది ఈ వారంలోనే కేబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉందని కొన్ని జాతీయ మీడియా సంస్థలు రాశాయి. తెలంగాణ, ఏపీ, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, కేరళ సహా పలు రాష్ట్రాల్లో ఈ ఇండస్ట్రియల్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. 


టీడీపీ కూడా ఈ విషయంపై ట్వీట్ చేసింది. ‘‘కేంద్ర మంత్రివర్గం బీహార్, ఆంధ్ర, పంజాబ్‌లో 12 పారిశ్రామిక పార్కుల కోసం రూ. 25,000 కోట్ల ప్యాకేజీని ఆమోదించనుందని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పేర్కొంది. ఈ పార్కులు పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి. వారంలోపు అనుమతులు రానున్న దీని వలన రూ. 1.5 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించగలవని, ప్రణాళికలో భాగంగా గృహ మరియు వాణిజ్య ప్రాంతాలతో కూడిన ఈ పారిశ్రామిక నగరాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయ తయారీని పెంచడం, మరియు ఉపాధిని సృష్టించడం వ్యూహంలో భాగంగా అని అందులో పేర్కొన్నారు. ఇటీవలే సిఎం చంద్రబాబు నాయుడు రెండు రోజులు ఢిల్లీలో ప్రధాని, మంత్రులను కలిసి వచ్చారు. తరువాత లోకేశ్ కూడా ఢిల్లీ వెళ్లి వచ్చారు’’ అని సోషల్ మీడియాలో టీడీపీ ఓ పోస్టు చేసింది.