Karimnagar News: నవ మాసాలు మోసి తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా పురిటి నొప్పులను సైతం భరించి తన పిల్లలకు జన్మనిస్తుంది తల్లి. మరి కన్న తల్లి పేగు తెంచుకొని పుట్టిన పిల్లలే తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు . జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేస్తే చివరకు తల్లిదండ్రులను అనాధలుగా మిగిలిస్తున్నారు. పిల్లలను కనడం పెంచి పెద్ద చేయడం మీ బాధ్యత తర్వాత ఆస్తులు పంచుకొని వెళ్లిపోవడం మా హక్కు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు నేటితరం. తండ్రి మరణిస్తే ఒంటరిగా ఉన్న తల్లికి బుక్కెడంత బువ్వ పెట్టేందుకు కూడా వెనకాడుతున్నారు కడుపున పుట్టిన పిల్లలు. పూరిగుడిసెలో ఉంటూ తలదాచుకుంటున్న ఓ వృద్ధురాలు తన పిల్లలు పట్టించుకోవడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది.


కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు కు చెందిన నరసవ్వ తన కొడుకులు బుక్కెడంత అన్నం కూడా పెట్టడం లేదంటూ తిమ్మాపూర్ పోలీసులను ఆశ్రయించింది. నరసవ్వకు పుట్టిన నలుగురు కుమారులను పెంచి పోషించి ప్రయోజకులను చేస్తే ఆస్తిపాస్తులను పంచుకున్నారే కానీ తన కష్టసుఖాలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. భర్త మరణాంతరం నుంచి ఒంటరిగా ఉంటున్న నరసవ్వ నలుగురు కుమారులు ఉన్న అనాధగా మారిన పరిస్థితి ఏర్పడిందంటూ తన దీన పరిస్థితిని పోలీసులకు విన్నవించుకుంది.


అయితే అలుగునూరు గ్రామంలోని ఓ పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తున్న నరసవ్వకు బొక్కెడంత అన్నం కూడా పెట్టడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది. తనపై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తన కుమారులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరుతోంది నరసవ్వ. అయితే తల్లిపై వ్యవహరిస్తున్న తీరుపై తన కుమారులతో మాట్లాడి నచ్చచెప్పుతామని ఎల్ఎండి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చేరాలు నరసవ్వకు హామీ ఇచ్చారు.


ఏది ఏమైనాప్పటికీ సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా పిల్లలు తమ తల్లిదండ్రులపై చూపిస్తున్న వివక్ష  మాత్రం మారడం లేదు ఎన్ని చట్టాలు వచ్చినా కూడా వీరితీలలో మాత్రం మార్పు రావడం లేదు. వృద్ధాప్య సమయంలో తల్లిదండ్రులను చూసుకోనట్లయితే సిటిజన్ యాక్ట్ ప్రకారం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి వృద్ధురాలు నరసవ్వకు పోలీసులు ఏ విధమైన న్యాయం చేకూరుస్తారో వేచి చూడాల్సి ఉంది.