Two more MLCs resigned from YSRCP :  ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి ఆ పార్టీ నేతలు వరుసగా గుడ్ బై చెబుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ,   బల్లి కల్యాణ్ చక్రవర్తి గుడ్ బై చెప్పారు. వీరిద్దరు ఏ పార్టీలో చేరుతారో అన్నదానిపై ప్రకటన చేయలేదు. వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేశారు. 


బల్లి కల్యాణ చక్రవర్తి నెల్లూరు కు చెందిన వారు. ఆయన మాజీ ఎంపీ బల్లి దర్గాప్రసాదరావు కుమారుడు. తిరుపతి ఎంపీగా ఉంటూ బల్లి దుర్గా ప్రసాదరావు చనిపోయారు. ఉపఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ దుర్గా ప్రసాదరావు కుటుంబానికి టిక్కెట్ కేటాయించలేదు. సాధారణంగా పదవిలో ఉంటూ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి టిక్కెట్ కేటాయిస్తారు. కానీ పాదయాత్రలో తనకు ఫిజియోగా పని చేసిన వైద్యుడు గురుమూర్తికి టిక్కెట్ ఇచ్చారు. బల్లి దుర్గాప్రసాదరావు కుమారుడు కల్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయన పదవి కాలం ఇంకో మూడేళ్లు ఉంది. 


విచారణాధికారి ఎదుట కాదంబరి జత్వానీ హాజరు - తనకు ఎదురైన ఇబ్బందులు వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న నటి


మరో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ  అయ్యారు.  ఆమె భర్త నారాయణరావు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. ఆమె బీజేపీ అనుబంధ సంస్తల్లో చురుగ్గా ఉండేవారు.  మత్స్యకారుల్లో వాడబలిజ సామాజికవర్గానికి చెందిన ఆమె జాతీయ మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమెకు బీజేపీకి చెందిన కొంత మంది కీలక నేతలతో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఆయితే ఆమెకు వైసీపీలో ఎమ్మెల్సీ రావడమే ఆ పార్టీలో ఆశ్చర్యానికి కారణం అయింది. ఇప్పటికీ ఆమెకు మరో ఐదేళ్ల వరకూ పదవి కాలం ఉంది. ఇప్పుడు రాజీనామా చేసి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.       


న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం - సుప్రీంకోర్టు ఆగ్రహంతో రేవంత్ రెడ్డి వివరణ


ఇప్పటికే చీరాలకు చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. అలాగే మరికొంత మంది ఎమ్మెల్సీలు ఇప్పటికే నారా లోకేష్ ను కలిశారు. శాసనమండలిలో మెజార్టీ వైసీపీకే ఉంది. ప్రతిపక్ష నేతగా ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను నియమించారు. ఇప్పుడు వరుసగా ఎమ్మెల్సీలు అంతా రాజీనామాలు చేస్తూండటంతో ఆయన ప్రతిపక్ష నేత హోదా కూడా పోయే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేసినా ఉపఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశం లేదు. అందకే ఇతర పార్టీలతో మాట్లాడుకుని వారు రాజీనామాలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.