సత్యసాయి జిల్లా కదిరిలో ఓ వాలంటీర్ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. గ్రామ సచివాలయంలో వ్యవసాయ అధికారుల ముందు వాలంటీర్ తనను తానే చెప్పుతో కొట్టుకున్నాడు. నగేష్ నాయక్ అనే వాలంటీర్ రాందాస్ తాండ గ్రామంలో వాలంటీర్ గా పని చేస్తున్నాడు. పంట నష్టపరిహారం చెల్లింపులో ఎర్ర దొడ్డి పంచాయతీ రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రభుత్వ తీరుకు నిరసనగా నగేష్ నాయక్ రాందాస్ తాండ గ్రామ వాలంటీర్ గా రాజీనామా చేశాడు.


కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి పంచాయతీ రైతులకు పంట నష్టపరిహారం అందించే విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని సిబ్బందిని లోపలే ఉంచి సచివాలయానికి తాళం వేసి రైతులు నిరసన తెలిపారు. తన క్లస్టర్ పరిధిలో 50 మంది రైతులకు ఈ క్రాప్ బుకింగ్ చేసినా అనర్హులైన ఒక కుటుంబానికి తప్ప 49 మంది రైతులకు పంటల బీమా నష్టపరిహారం అందలేదని గ్రామ వలంటీర్ నగేష్ నాయక్ ఆరోపించారు.


గత మూడు సంవత్సరాలుగా తమ కుటుంబానికి సైతం పంటల బీమా రాలేదని ఎర్రదొడ్డి పంచాయతీలో రైతులు ఆవేదన చెందారు. పంచాయతీ పరిధిలోని 1200 మంది రైతులు E-crop బుకింగ్ చేసుకున్నా, కేవలం 44 మంది రైతులకు మాత్రమే పంటల బీమా వర్తించిందని విమర్శించారు. అందులో ఎక్కువ మంది అనర్హులుగా ఉన్నట్లు  రైతులు ఆరోపిస్తున్నారు.