Southwest Monsoon: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లోని మొత్తం 41 మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ మండలాల్లో పిడుగులు పడొచ్చు. 16  మండలాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం, టెక్కలి,  సారవకోట, మెలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హీరామండలం, లక్ష్మీనరసుపేట, గంగువారి  సిగడాం విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల,గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ, రామభద్రాపురం, దత్తిరాజేరు, సంతకవిటి, రాజాం, మెరకముడిదం, బొబ్బిలి, వంగర, తెర్లాం, రేగడి ఆమదాలవలస మండలాలకు పిడుగు సూచన ఉంది. 


అనకాపల్లి జిల్లాలో మూడు మండలాలు చీడికాడ, కె.కొత్తపాడు, దేవరపల్లిలకు పిడుగు ప్రమాదం ఉంది. అల్లూరి  సీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ, అరకు వ్యాలీ, అనంతగిరి మండాలకు విపత్తులనిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పార్వతీపురంమన్యం జిల్లాలో పాచిపెంట,బలిజిపేట,పాలకొండ, సీతంపేట ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడింది. దీని వల్ల  ప్రస్తుతం కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు  కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ​, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. 






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా.. రాయలసీమలో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విజయవాడ​, గుంటూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లాలో విస్తరిస్తున్న భారీ వర్షాలు నేరుగా కడప జిల్లాలొకి విస్తరించనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని సూచించారు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు.


తెలంగాణలో వర్షాలు
హైదరాబాద్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమమయ్యాయి. పలు చోట్ల నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కాగా, రాష్ట్రంలో నేడు సైతం సైతం పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.  ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.






Also Read: Gold-Silver Price: నేడు పెరిగిన బంగారం, వెండి ధర మాత్రం స్థిరం - ఇవాళ్టి తాజా రేట్లు ఇవీ