TTD News: తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతో శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు ఏడు కొండలకు క్యూ కడుతున్నారు. సోమవారం రోజున 70,366 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 38,653 మంది తలనీలాలు సమర్పించగా, 4.32 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయి శిలాతోరణం వరకూ భక్తులు లైన్ లో వేచి ఉన్నారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. ఇక క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు త్రాగునీరు, అన్నప్రసాదాలు, మజ్జికలను టీటీడీ నిరంతరాయంగా అందిస్తుంది. భక్తులు సమన్వయం పాటించి శ్రీనివాసుడి దర్శనం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. 


Also Read:నిత్య పూజ ఎలా చెయ్యాలి? సనాతన ధర్మం ఏం చెబుతోంది?


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. 


Also Read: ఈశాన్యంలో ఇవి ఉంటే అనారోగ్యాలు వెంటాడుతాయి జాగ్రత్త


సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "మంగళవారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడం ఈ సేవ విశేషం. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. అటు తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం జరిపిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.