TTD News:  తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది.. శనివారం శ్రీనివాసుడికి ప్రీతిపాత్రమైన రోజు. అందుకే సుప్రభాతం సేవ అనంతరం నువ్వుల గింజలతో అర్చకులు ప్రసాదాన్ని నివేదిస్తారు. శుక్రవారం రోజు 63,253 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 24,490 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ. 5.16 కోట్లు కానుకలగా అందాయి. సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 24 కంపార్ట్ మెంటల్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటలకు పైగా సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది.


శనివారం ప్రత్యేక కైంకర్యాలు


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు. ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారాలు తెరిచిన అర్చకులు, వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారిని తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్తోత్రంతో స్వామి వారిని మేల్కొలిపారు.


ఈరోజు మొదటి నివేదనగా పచ్చిపాలను, నల్ల నువ్వులు, బెల్లంతో చేసిన ప్రసాదాన్ని స్వామివారికి నివేదిస్తారు. తర్వాత వైఖాసన అర్చకులు బ్రహ్మ తీర్ధాన్ని తాము స్వీకరిస్తారు. అనంతరం జియ్యంగార్లకు, సన్నిధి గొల్లలకు తీర్ధాన్ని అందజేస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజనం జరుగుతుంది. మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి, తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు.. తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు. నవనీత హారతి సమర్పించిన తర్వాత.. శ్రీవారికి సహస్ర నామ అర్చన సేవ చేస్తారు. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు. అనంతరం శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహించిన తరువాత సర్కారు వారి హారతి జరిపి వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు అనుమతిస్తారు.


సర్వదర్శనానికి భక్తులకు అనుమతి


శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను శాస్త్రోక్తంగా నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని తిరుమాఢ వీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు. శ్రీవారికి రాత్రి తోమాల,రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహించి సర్వ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.