తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత పులి హల్ చల్ చేసింది. ఏడవ మైలు వద్ద చిరుత ఐదేళ్ళ బాలుడిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. బాలుడితో పాటుగా ఉన్న బాలుడి తాత, భక్తులు కేకలు వేస్తూ అటవీ ప్రాంతంలో చిరుతను వెంబడించడంతో దాదాపు 150 మీటర్ల దూరంలో చిరుత బాలుడిని వదిలి వెళ్ళింది. ఐతే అటవీ ప్రాంతంలో ఏడుస్తున్న బాలుడిని గుర్తించిన అటవీ శాఖ ఉద్యోగి బాలుడి‌ని సురక్షితంగా అటవీ ప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చి టీటీడీ విజిలెన్స్,‌ పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. చిరుత దాడిలో బాలుడి తలకు, గుండె భాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయి.


సమాచారం తెలుసుకున్న టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సంఘటన స్ధలానికి చేరుకుని బాలుడిని హుటాహుటిన 108 వాహనంలో తిరుపతిలోని చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వైపు చిరుత దాడి ఘటనలో గాయపడ్డ బాలుడిని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.


ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  ఆధోనికి చేందిన ఐదేళ్ళ బాలుడు‌ కౌశిక్.. తన తల్లిదండ్రులు, తన తాతతో కలిసి అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా ఏడో మైలు వద్ద స్నాక్స్ తీసుకుంటున్న సమయంలో బాలుడిని చిరుత తీసుకెళ్ళిందని తెలిపారు. ఐతే అదే సమయంలో తిరుమలలో విధులు నిర్వర్తించే ఎస్సై రమేష్  తిరుమలకు వెళ్తుండగా ఘటన జరగడంతో భక్తులతో కలిసి బాలుడు ఆచూకీ కోసం అటవీ ప్రాంతం గాలించడం, బాలుడిని సురక్షితంగా తీసుకుని రావడం జరిగిందని, బాలుడి ప్రాణాలకు ఎటువంటి హానీ‌ లేదని చెప్పారు. ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యులు బాలుడికి చికిత్స అందిస్తున్నారని, నడక మార్గంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాంమని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.