Tirumala News: తిరుమల నడకదారిలో కొంత కాలం క్రితం చిరుత ఓ బాలికపై దాడి చేయడం... ఈ ఘటనలో చిన్నారి మృతి చెందడం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని టీటీడీ అధికారులు బోనులను ఏర్పాటు చేసి మరీ ఐదు చిరుతలను బంధించారు. అయితే తాజాగా ఇందులోంచి రెండు చిరుతలను వదిలేశారు. 


ఎందుకు వదిలేశారంటే..?


చిరుత దాడిలో మృతి చెందిన బాలిక డీఎన్‌ఏ రిపోర్టును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌ సంస్థ ఇటీవలే విడుదల చేసినట్లు తిరుపతి డీఎఫ్‌వో సతీష్‌ తెలిపారు. ఈక్రమంలోనే బంధించిన ఐదు చిరుతల నమూనాలను పరీక్షకు పంపారట. ఆ పరీక్ష నివేదిక ప్రకారం రెండు చిరుతలు బాలికపై దాడి చేయలేదని తేలిందట. దీంతో  ఆ రెండు చిరుతలను వదిలిపెట్టేసినట్లు డీఎఫ్ఓ సతీష్ వెల్లడించారు. అయితే ఒక చిరుతను గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో విడిచి పెట్టగా.. మరొక దాన్ని విశాఖలోని జంతు ప్రదర్శనశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. మరో మూడింటి నివేదికలు రావాల్సి ఉందని.. అవి వచ్చాకే వాటిని ఏం చేయాలో డిసైడ్ చేస్తామని స్పష్టం చేశారు. 



చిరుతలను పట్టుకున్నారిలా!


24 జూన్‌ 2023 మొదటి చిరుతను టీటీడీ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది కలిసి బంధించారు. ఇకపై అంతా ప్రశాంతమే అనుకున్నారంతా కానీ ఆగస్టులో అసలు కథ మొదలైంది. చిరుతలో వైల్డ్ యాంగిల్‌ను ప్రపంచం చూసింది. చిన్నారి తినేసిన చిరుత వచ్చే మార్గాలను అన్వేషించారు అధికారులు. అది తిరిగే మార్గాల్లో ప్రత్యేక ట్రాప్‌లు ఏర్పాటు చేశారు కెమెరాలు ఫిట్ చేశారు. ఇలా అష్ట దిగ్బంధం చేసిన తర్వాత మరో చిరుత బోనులో పడింది. ఆగష్టు 14 రెండో చిరుత అధికారుల ట్రాప్‌కు చిక్కింది. అక్కడకు మూడు రోజుల తర్వాత మూడో చిరుతను ఆగష్టు 17న పట్టుకున్నారు. ఇక చిరుతలు లేవేమో అనుకున్నారు కానీ భక్తుల్లో ఎక్కడో చోట భయం కలిగింది. కొందరు సీనియర్ అధికారులు మాత్రం ఇంకా చిరుతలు ఉండనే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. వారి అనుమానమే నిజమైంది. మరోసారి చిరుత జాడను పసిగట్టారు అధికారులు. దీంతో మరోసారి ట్రాప్‌ ఏర్పాటు చేశారు. అనుకున్నట్టుగానే ఎర కోసం వచ్చిన చిరుత ఆగష్టు 28న బోనులో చిక్కింది. అంతా ఊపిరి పీల్చుకున్న టైంలో వారం రోజుల తర్వాత ఇవాళ సెప్టెంబర్‌ 6వ మరో చిరుత చిక్కింది. ఇది ఇక్కడితో ఆగుతుందా ఇంకా ఉన్నాయా అన్న అనుమానం భక్తుల్లో పోవడం లేదు. 


తిరుమలకు కాలినడక వెళ్లే భక్తుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. వారం పది రోజులకోసారి చిరుతలను బంధిస్తున్నారు. భక్తుల చేతికి కర్రలు ఇచ్చారు. ఇదేనా ఇంకా ఏమైనా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిరుతను బంధించినప్పుడల్లా టీటీడీ ఈవో కానీ, ఛైర్మన్‌ కానీ మీడియాతో మాట్లాడుతూ భక్తుల రక్షణే తమ తొలి ప్రాధాన్యమని చెబుతున్నారు. ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని చెబుతున్నారు. ఇలా ఎన్ని రోజులు సాగుతుంది. ఇంకా ఎన్ని చిరుతలు ఉండొచ్చు అనే అంచనాలు మాత్రం అధికారుల వద్ద లేదనే విమర్శలు ఉన్నాయి.