Tirumala Children News: తిరుమల: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఆర్బీసీ సెంటర్‌కు చెందిన ముగ్గురు బాలురు బుధవారం మధ్యాహ్నం బయటకు వెళ్లి కనిపించకుండా పోయారు. తమ పిల్లలు అదృశ్యమయ్యారంటూ వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


తిరుమల టూటౌన్‌ ఎస్సై సాయినాథ్‌ చౌదరి వివరాలు వెల్లడించారు. తిరుమలకు చెందిన ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారని ఫిర్యాదులు వచ్చాయి. తిరుమలకు చెందిన శ్రీవరదన్‌(13), వైభవ్‌ యోగేశ్‌(13), చంద్రశేఖర్‌(13) కనిపించకుండాపోయారు. వైభవ్‌ యోగేశ్‌.. యోగేశ్ కుమారుడు కాగా, కృష్ణ తనయుడు చంద్రశేఖర్‌. ఈ బాలురు తిరుమలలోని ఎస్వీ హైస్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నారు. బుక్స్ తెచ్చుకోవడానికి ఇంటికి వెళ్తున్నామని చెప్పి బయటకు వెళ్లిన వీరు ఇంటికి వచ్చారని తెలిపారు. ఇంట్లో నుంచి ల్యాప్ టాప్ తీసుకుని వెళ్లి, తిరుమల ఏడుకొండల బస్టాప్ కు చేరుకున్నారని ఎస్సై తెలిపారు. ఆ తరువాత చిన్నారుల ఆచూకీ తెలియడం లేదని, అటు స్కూల్ కు వెళ్లలేదు, ఇటు ఇంటికి తిరిగి రాలేదని కుటుంబసభ్యులు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. తమ పిల్లల ఆచూకీ తెలపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.