సప్తగిరుల్లో‌ భక్తుల రద్దీ‌ కొనసాగుతుంది.. వేసవి‌ సెలవులు, వారంతరం కావడంతో‌ వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.. దీంతో ఏడుకొండలు గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి.. అలిపిరి‌ నడక మార్గం, శ్రీవారి‌ మెట్టు మార్గం గుండా అధిక సంఖ్యలో భక్తులు నడుచుకుంటూ తిరుమలకు చేరుకుంటున్నారు.. దీంతో‌ క్యూ‌లైన్స్ అన్ని భక్తులతో నిండి పోయింది.. వైకుంఠం‌ క్యూ కాంప్లెక్స్ మొదలుకుని నారాయణగిరి ఉద్యానవనం‌ నిండి శిలాతోరణం మీదుగా, పాప వినాశనం రోడ్డు వద్ద గల ఆర్టోపస్ బిల్డింగ్ వరకూ భక్తులు దాదాపు నాలుగు కిలో‌మీటర్ల మేర వేచి ఉన్నారు.. దీంతో టైం స్లాట్ టోకెన్లు‌ లేని సర్వదర్శనం‌ భక్తులకు దాదాపుగా 28‌ గంటలకు‌ పైగా సమయం పడుతుంది.. ఐతే భక్తుల రద్దీ దృష్ట్యా అప్రమత్తంమైన టీటీడీ అధికారులు‌ క్యూ లైన్స్ లో వేచి‌ ఉన్న భక్తులకు అన్నప్రసాదం, త్రాగునీరు, పాలు, వంటి సౌకర్యాలు నిరంతరంగా ‌అందిస్తున్నారు.. క్యూలైన్స్ లో భక్తులకు‌ ఎండ తెలియకుండా రేకులతో షెడ్లు ఏర్పాటు చేశారు.. భక్తులు సమన్వయం పాటించి శ్రీనివాసుడి దర్శనం‌ పొందాలని‌ టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.


మే 25న 34 గంటల సమయం
వేసవి సెలవులు, వారంతరం కావడంతో తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం రోజున 74,583 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 40,343 మంది తలనీలాలు సమర్పించగా.. 3.37 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లల్లో భక్తులు నిండిపోయారు. బయట శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 34 గంటల సమయం పట్టింది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది.


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యా లు నిర్వహిస్తున్నారు అర్చకులు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.‌ ఆ తర్వాత తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో "బెల్లం పూర్ణం బోండాలు, పోలీల" శుక్రవారం ప్రత్యేకంగా నివేదిస్తారు. ఇక వీటితో పాటుగా అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.


సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు జరుపుతారు. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవాన్ని నిర్వహిస్తారు.