కలియుగ వైకుంఠ నాథుడు శ్రీనివాసుడు కొలువైయున్న ఏడు కొండల్లోని అంజనాద్రే హనుమన్ జన్మస్ధలంగా నిర్దారించిన తిరుమల  తిరుపతి దేవస్థానం... అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. శాస్త్రోక్తంగా తిరుమలలోని అంజనాద్రి క్షేత్రం అభివృద్ధి పనులు ప్రారంభించింది. మాఘ పౌర్ణమి పర్వదినంలో ఉదయం 9:30 గంటలకు వేద పండితుల వేదోచ్ఛరణ మధ్య క్రతువు సాగింది. ఈ కార్యక్రమాలలో విశాఖ స్వరూపానంద స్వామి, చిత్రకూట పీఠాధిపతి ఇతర పీఠాధిపతులు హాజరయ్యారు. ఆకాశగంగ తీర్ధం ఆలయ అభివృద్ధి నమూనా చిత్రాన్ని, హనుమన్ జన్మవృత్తాంతం చారిత్రక నిరూపణ పుస్తకాన్ని టిటిడి విడుదల చేసింది.


అంజనాద్రిలో పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి. శంకుస్థాపన రద్దు చేయాలని కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని ఎవరైనా కోర్టు ఆర్డర్‌ చూపిస్తే కచ్చితంగా స్పందిస్తామన్నారాయన. 






హనుమంతుడి జన్మస్థలంలో ఎన్నో వివాదాలు మరెన్నో ఆరోపణలు. చివరకు తిరుపతిలోని అంజనాద్రి.. మారుతీ జన్మస్థానంగా టీటీడీ తేలించింది. వీలైనంత త్వరగా దాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది. 







 ఆంజనేయుడి జన్మస్థలంపై హింపీ పీఠం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. టీటీడీ ఎన్ని సార్లు వివరణ ఇచ్చినా వాళ్లు సంతృప్తి చెందలేదు. అందుకే టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ వెబినార్ నిర్వహించింది.  ఇందులో దేశ విదేశాల్లోని పీఠాధిపతులు, మఠాధిపతులు, పురాణ, ఇతిహాస, భౌగోళిక పరిశోధనల్లో నిపుణులు, నిష్ణాతులు పాల్గొన్నారు. వెబినార్ అనంతరం అప్పటి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పురాణాలు, శాసనాలు.. భౌగోళిక ఆధారాలకు అనుగుణంగా ఆంజనేయుడి జన్మ స్థలం తిరుమల అని చెబుతున్నాయని చెప్పారు. ఇందులో ఎలాంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. 



జాతీయ సంస్కృత జాతీయ ఆచార్యులు చ‌క్రవ‌ర్తి రంగ‌నాథ‌న్ కూడా తిరుమ‌ల క్షేత్రంలో అంతర్భాగమైన అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామి వారి జన్మ స్థలమని, ఆళ్వారుల పాశురాలలోని వైష్ణవ సాహిత్యం ద్వారా తెలుస్తోందని తెలిపారు. వైష్ణవ సాహిత్యంలో తిరుమ‌ల‌-అంజ‌నాద్రి అనే అంశంపై మాట్లాడుతూ భ‌గ‌వంతుడి అనుగ్రహంతో జ‌న్మించిన ఆళ్వారులు భ‌క్తి ప్రప‌త్తుల‌ను న‌లుదిశలా వ్యాపింప చేశార‌ని చెప్పారు. వారు ర‌చించిన 4 వేల పాశురాల‌లో 207 పాశురాలు తిరుమ‌ల క్షేత్ర వైభ‌వాన్ని, అందులో 12 పాశురాలు విశేషంగా ఆంజ‌నేయ‌స్వామివారి గురించి తెలుపుతున్నాయని తెలిపారు.




 



జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ రాణి స‌దాశివ‌మూర్తి కూడా దీన్ని ధ్రువీకరించారు. అంజ‌నాద్రి దాస క్షేత్రమ‌ని, వేంక‌టాచ‌ల మ‌హాత్యం అనేది వివిధ‌ పురాణాల సంకలనమని చెప్పారు. కృత యుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, కలియుగంలో వెంకటాచలంగా పిలుస్తున్నారని చెప్పారు. ప‌ద్మ, స్కంద‌, బ్రహ్మాండ పురాణంలో ఈ విషయం ఉందని ఆమె వివరించారు.


ఇలా అందరి అంగీకారంతో తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థానంగా టీటీడీ తేల్చి చెప్పింది. ఈ మేరకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. వైభవంగా శంకుస్థాపన ప్రక్రియను కూడా పూర్తి చేసింది.