Pawan Kalyan To visit Tirupati: ఇటీవల శ్రీకాళహస్తిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్త కొట్టే సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకోవడం తెలిసిందే. ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. సీఐ అంజూ యాదవ్ కు నోటీసులు జారీ చేసింది. సమోటోగా కేసు నమోదు చేసుకొని ఈనెల 27వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే తమ పార్టీ కార్యకర్తపై సీఐ దాడి చేయడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తిరుపతికి వెళ్లి ఎస్పీకి వినతిపత్రం సమర్పించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.


జనసేన నాయకుడు కొట్టే సాయిపై అమానుషంగా దాడి చేసిన సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ సోమవారం తిరుపతికి వెళ్లనున్నారు. కొట్టే సాయిపై దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఉదయం జిల్లా ఎస్పీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వినతిపత్రం సమర్పిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. జిల్లా ఎస్పీ ద్వారా రాష్ట్ర డీజీపీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని జనసేన నిర్ణయించినట్టు చెప్పారు. 


శనివారం మధ్యాహ్నం ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 9గం. 30ని.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 10గం. 30ని.లకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్ వినతి పత్రం అందిస్తారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని శాంతియుత, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


సీఐ అంజూ యాదవ్‌కి మానవ హక్కుల కమిషన్ నోటీసులు 
జనసేన కార్యకర్త కొట్టే సాయిపై చేయి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో సీఐ అంజూ యాదవ్ పై తీవ్ర విమర్శలు రాగా.. తాజాగా మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. సదరు సీఐకి నోటీసులు జారీ చేసింది. సమోటోగా కేసు నమోదు చేసుకొని ఈనెల 27వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.  


అసలేం జరిగిందంటే..? 
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు దుమారం సృష్టించారు. వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు, వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనికి ప్రతిగా శ్రీకాళహస్తిలో బుధవారం జనసేన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సీఐ అంజూ యావద్.. జనసేన నాయకుడు కొట్టె సాయిపై చేయి చేసుకున్నారు. అక్కడే ఉన్న వారు ఈ వీడియోను తీసి నెట్టింట పెట్టారు. క్షణాల్లోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial