Tirumala News: టీటీడీ(TTD) ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల(Tirumala) ఆలయ ప్రతిష్ఠ మంటగలిపారని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధికారులను మార్చివేస్తోంది. ఇప్పటికే ఈవో(E.O)గా శ్యామలారావును నియమించగా..ఇప్పుడు జేఈవో(J.E.O)గా వెంకయ్య చౌదరిని నియమించింది.


తిరుమల ప్రక్షాళన
తిరుమల తిరుపతి దేవస్థానములను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా సీఎం చంద్రబాబు(Chandra Babu) నడుంబిగించారు. వైసీపీ(YCP) పాలనలో అవినీతి, అక్రమాలకు  కేంద్రంగా టిటీడీని మార్చేశారని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. అందుకే ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేని సీనియర్, సిన్సియర్ అధికారులకు కీలక పదవుల్లో పోస్టింగ్‌ ఇస్తోంది. తిరుమలకు గత వైభవం తీసుకురావడంతోపాటు..కేవలం ఆధ్యాత్మిక వాతావరణం తప్ప ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా తిరుమల(Tirumala)కొండలకు పూర్వస్థితిని తీసుకురావాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈవో ధర్మారెడ్డిని తొలగించింది. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్‌(I.A.S) అధికారి శ్యామలారావును నియమించింది. ఆయన్ను కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్‌పై  రాష్ట్రాన్ని రప్పించి కీలకమైన పదవిని కట్టబెట్టింది. గతంలోనూ ఆయన తిరుమల ఈవోగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు మరో కీలకమైన జేఈవో పోస్టులో సైతం చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని(Venkaiah Chowdary) నియమించారు. ఈయన కూడా కేంద్రం నుంచి డిప్యూటేషన్‌పై  రాష్ట్రానికి తీసుకొచ్చారు.


నిబద్ధతకు నిదర్శనం
2005 బ్యాచ్ ఐఆర్‌ఎస్‌(I.R.S) అధికారి అయిన చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి మంచి సమర్థవంతమైన అధికారిగా పేరుంది. ప్రస్తుతం కేంద్ర,ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని కష్టమ్స్‌ కమిషనరేట్‌ పరిధిలోని విజయవాడశాఖ కమిషనర్‌గా ఆయన పనిచేస్తున్నారు. ఆయన్ను డిప్యూటేషన్‌ పై ఏపీకి పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. డిప్యూటేషన్‌పై మూడేళ్లపాటు పంపేందుకు అంగీకరించింది. దీంతో ఆయన్న తితిదే జేఈవోగా రా‌ష్ట్ర ప్రభుత్వం నియమించింది. గతంలో ఆయనకు ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్‌ ఛైర్మన్‌గా ఎండీగా పనిచేసిన అనుభం ఉంది.


రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి ‌అనుగుణంగానే తిరుమల ప్రక్షాళన దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈవోగా శ్యామలారావు బాధ్యతలు చేపట్టిన వెంటనే దళారుల ఆగడాల ఆటకట్టించారు. విజిలెన్స్ విభాగాన్ని బలోపేతం చేశారు. ఎక్కడికక్కడ దాడులు చేసి దళారులు పారిపోయేలా చేశారు. భక్తులను దోచుకుంటున్న ఉద్యోగులను హెచ్చరించారు. వ్యాపారులను  అదుపు చేయడంతోపాటు...సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకునేలా మార్పులు, చేర్పులు చేపట్టారు. కాలినడక భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడంతోపాటు...వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు అన్నీ తెరిపించి భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి ఉంచితే వారికి ప్రసాదం, పాలు, టీ వంటి అదనపు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని....ఉచిత దర్శనం భక్తులను గంటల తరబడి కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లలోనే వేచి ఉంచేలా చేశారు. ఇప్పుడు సర్వదర్శనం భక్తులందరినీ క్యూకాంప్లెక్స్‌లోకి అనుమతిస్తున్నారు. గతంలో మాదిరిగా అక్కడ స్వామివారి ప్రసాదం, చిన్నపిల్లలకు పాలు అందిస్తున్నారు. టిక్కెట్లు జారీ, గదుల కేటాయింపులోనూ  పెనుమార్పులు తీసుకురానున్నారు. 


తిరుమలలోనే ఈవో, జేఈవో 
వేలకోట్ల రూపాయల ఆస్తులు, కోట్లాది మంది హిందూవుల మనోభావాలతో తిరుమల ఆలయం ముడిపడి ఉండటంతో గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తిరుమల ఈవోగా  ఐఏఎస్‌స్థాయి  అధికారిని నియమించడం జరిగింది. అయితే వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మారెడ్డి (Dharma Reddy) కోసం ఆ స్థాయిన మళ్లీ తగ్గించింది. తిరుమలకు ఈవో సహా ఇద్దరు జేఈలు ఉండగా....వారిని తిరుపతికే పరిమితం చేసింది. చంద్రబాబు తిరిగి అధికారం చేపట్టడంతో ఈవోగా మళ్లీ ఐఏఎస్‌ అధికారినే నియమించారు. జేఈవోగానూ ఐఆర్‌ఎస్‌ అధికారిని తీసుకువచ్చారు. వీరిరువురూ తిరుమలలోనే పనిచేయనున్నారు. 


Also Read: శ్రీశైలంలో అద్భుత దృశ్యం - శివలింగాన్ని చుట్టుకుని ఉన్న నాగుపాము, వీడియో వైరల్


Also Read: అరుదైన ఘటన - తోకతో పుట్టిన బాలుడు, శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు