మరో అమానవీయ సంఘటన. మనిషిగా తలదించుకునే సంఘటన. మనుషి మరమనుషిగా మారిపోతున్నాడా అనే అనుమానం కలిగించే హృదయ విదారక సంఘటన. మొన్న తిరుపతి రుయా ఆస్పత్రిలో అంబులెన్స్​ మాఫియా బెదిరింపులు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే.. రుయా ఘటన మరువక ముందే నిన్న నెల్లూరు జిల్లా సంగం ఆస్పత్రిలోనూ ఇదే సీన్‌. నేడు తిరుపతి జిల్లా నాయుడు పేట ఆసుపత్రిలోనూ అదే దృశ్యం. 


చేతిలో పసిబిడ్డ అచేతనంగా పడి ఉంటే ఆ కన్నవారికి ఎంత కష్టం. అదే బిడ్డ డెడ్‌బాడీని ఊరి వరకు బైక్‌పై తీసుకెళ్లాలంటే ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. ఎంత కన్నీరు కార్చి ఉంటాడు. ఆ బిడ్డ చావు తనకెందుకు రాలేదని ఎన్నిసార్లు ప్రశ్నించుకొని ఉంటాడు. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లి గ్రామానికి చేందిన అన్న చెల్లెలు శ్రావంత్, అక్షయ ఆడుకుంటూ గ్రావెల్​ గుంతలో పడి ఇద్దరు నీట మునిగారు. దీన్ని గమనించి గొర్రెల కాపారి శ్రావంత్‌ను కాపాడగా.. అక్షయ(2) పరిస్థితి విషమించింది. నాయుడుపేట ఆస్పత్రికి తరలించేలోపు అక్షయ మృతి చెందింది.


నాయుడుపేట ఆస్పత్రి నుంచి రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించడంతో బాలిక తండ్రి నానా అవస్థలు పడ్డాడు. ప్రైవేటు అంబులెన్స్‌లో చిన్నారి మృతిదేహాన్ని తీసుకెళ్ళెందుకు డబ్బుల్లేక పోవడంతో, ఆసుపత్రి సమీపంలో‌ని ఆటో స్టాండ్ వద్దకు వెళ్ళి తన భాధ ఆటో డ్రైవర్లుకు చెప్పుకున్నాడు. అక్కడి ఆటో డ్రైవర్లు ఏమాత్రం కనికరం చూపలేదు. రెండేళ్ళ బాలిక మృతదేహాన్ని తరలించేందుకు నిరాకరించారు. 


గుండెల్లో బాధను దిగమింగుతూనే చేసేది లేక బాలిక తండ్రి నాయుడుపేట నుంచి మృతదేహాన్ని బైక్‌పై తీసుకుని స్వగ్రామానికి చేరుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో‌ను చూసిన నెటిజన్లు మృతదేహాని తరలించేందుకు వాహనం లభించక పోవడంపై మండిపడితున్నారు.


అక్షయ మృతదేహం తరలింపుపై లోకేష్ ట్విట్


కుళ్ళు కుతంత్రాలతో దుష్ప్రచారం చేస్తున్నారని మాట్లాడడం వల్ల జగన్‌కు ఆయన పార్టీ లీడర్లకు ఆత్మసంతృప్తి కలగొచ్చేమోగానీ ప్రజలకు ఉపయోగం లేదన్నారు లోకేష్‌. తమపై అక్కసుతో జగన్ మాట్లాడుతున్న టైంలోనే తిరుపతి జిల్లా నాయుడుపేటలో రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్‌పై సొంత ఊరికి తీసుకెళ్ళాడు ఓ తండ్రి అని ట్వీట్ చేశారు. ఆసుపత్రి సిబ్బంది సహకరించక, అంబులెన్స్ మాఫియా డిమాండ్ చేసిన డబ్బు లేక చిన్నారి మృతదేహాన్ని 18 కిలోమీటర్లు బైక్‌పై తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ దయనీయ పరిస్థితిని కల్పించింది వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి పనిపై దృష్టి పెట్టండని లోకేష్ సూచించారు. అప్పుడైనా పరిస్థితులు మెరుగుపడతాయంటూ‌ నారా లోకేష్ ట్విట్ చేశారు.