మాంచి రొమాంటిక్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌. క్లిక్‌ చేస్తే లోపల ఉన్న పోస్టులు కూడా అంతకంటే రొమాంటిక్‌గా ఉన్నాయి. ఎలాంటి వాళ్లైనా టెంప్ట్ అయ్యేలా ఉండే పేజ్‌. బొమ్మ చూసి క్లిక్ చేశామో మనకు కచ్చితంగా వేరే బొమ్మ కనిపిస్తుంది.

  


సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో జనాన్ని మోసం చేస్తూనే ఉన్నారు.. అమాయకులైన యువతి, యువకులను, ధనవంతులను టార్గెట్ చేస్తూ సైబర్ మాయగాళ్లు వలపు వల విసురుతున్నారు. 


అల్లరి పిల్లతో అల్లరి అల్లరి


చిత్తూరు నగరానికి చెందిన మౌనిక్‌ ఫేస్‌బుక్‌లో అల్లరి పిల్ల అనే అకౌంట్‌ నుంచి ఫ్రెండ్ రిక్వస్ట్ వచ్చింది. ఆ రిక్వస్ట్‌ను యాక్సెప్ట్ చేశారు. అంతే అటు నుంచి మెసేజ్‌ల వరద మొదలైంది. ఎలా ఉన్నారు. ఏం చేస్తున్నారంటూ మాటలు కలిపారు అవతలి వ్యక్తి. 


సరదా చాటింగ్‌తో తిప్పలు


ఇలా కొన్ని రోజులు అయ్యాక గేమింగ్ యాప్‌లు పంపించడం మొదలైంది. సరదాగా సాగిందీ చాటింగ్. ఇలా ఒకరోజు సడెన్‌గా ఐఎంఓ యాప్ లైట్‌ను ఏపికే ఫార్మాట్‌లో పంపించారు. తెలిసిన వ్యక్తే కదా అంటూ ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారు.    


లైట్‌తో లేపేశారు


ఐఎంఓ లైట్ యాప్‌ ఇన్‌స్టాల్‌  చేసిన వెంటనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మౌనిక్‌కు తెలియకుండానే తన ఫోన్ కంట్రోల్‌ సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోయింది. అలా వెళ్లిన వెంటనే మౌనిక్‌ ఎస్.బి.ఐ అకౌంట్‌ను కూడా కంట్రోల్‌ చేశారు. మౌనిక్‌ ఖాతాలో బెనిఫిసియర్ గా కొటక్ మహేంద్ర అకౌంట్ నెంబర్ ని యాడ్ చేసుకున్నారు. నాలుగు దఫాలుగా రూ.3,64,227 ట్రాన్స్‌ఫర్  చేశారు.. 


అకౌంట్‌లో నగదు మాయం


వెంట వెంటనే నాలుగు దఫాలుగా అకౌంట్ లో నగదు ట్రాన్స్‌ఫర్‌ అయినట్టు మెసేజ్‌ రాగానే మౌనిక్ డౌట్‌ వచ్చింది. బ్యాంక్ అధికారులను అడిగి వివరాలు అడిగితే అప్పుడు అసలు నిజం తెలిసింది. ఆ రోజే యాడ్‌ అయిన ఓ కొత్త అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయని తెలుసుకున్నారు మౌనిక్. ఈ నెల 3న చిత్తూరు టూటౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.


మూడు రోజుల్లోనే..


సైబర్ వింగ్ పోలీసులు సహాయంతో సైబర్‌ టూల్స్‌ ద్వారా వివరాలు రాబట్టిన పోలీసులు ముఠా గుట్టు రట్టు చేశారు. మోసం జరిగిన మూడు రోజుల్లో సైబర్ నేరగాళ్ళు పోలీసులకు చిక్కారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఎనిమిది మందిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.‌ 


ఈ సైబర్‌ మూఠాలో ఓ యువతి ప్రధాన నిందితురాలిగా ఉండటంతో పోలీసులు షాక్ తిన్నారు. ప్రధాన నిందుతురాలైన మానస పరారీలో ఉంది. మానస కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎనిమిది మంది నిందితుల నుంచి రూ. 2,50,000 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..


అసలు ఫోన్ ను ఎలా హ్యాక్ చేస్తారంటే...


ముందుగా అల్లరిపిల్ల ఫేస్ బుక్ ప్రోఫైల్ నుంచి మానస ఫ్రెండ్ రిక్వస్ట్ పంపుతుంది. ఒక్కసారి రిక్వస్ట్ ను యాక్సెప్ట్ చేస్తే  వారిని బుట్టలో వేసుకుంటుంది. కొద్ది కొద్దిగా పరిచయం చేసుకుని మాయ మాటలతో చెప్తూ ముగ్గులోకి దించుతుంది. వీడియో కాల్ ద్వారా మాట్లాడి సమస్యలు ఉన్నాయంటూ తనకు కొంచెం డబ్బులు అవసరం ఉందని చెప్పి డబ్బులు పంపించాలని రిక్వస్ట్ చేస్తుంది. మొబైల్‌ హ్యాక్ చేసే యాప్‌ లింక్‌ పంపిస్తుంది. దాన్ని క్లిక్ చేయమని చెప్తుంది. పొరపాటున మానస పంపించిన లింక్‌ క్లిక్ చేస్తే ఫోన్ మొత్తం సైబర్‌ నేరగాళ్ల కంట్రోల్‌కి వెళ్ళి పోతుంది. 


ఒక్కసారి ఫోన్ తమ కంట్రోల్‌లోకి వచ్చాక క్రెడిట్ కార్డ్స్‌, రుణాలు ఇప్పిస్తామని రకరకాల కారణాలు చెప్పి ముందే సేకరించిన వారి అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. వాళ్ల నుంచి మరికొంత తిరిగి తీసుకొని జల్సాలు చేస్తుంటారు. విశాఖపట్నం, బెంగళూరు వంటి నగరాల్లో ఎంజాయ్ చేసేవాళ్లు. 


ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు..!!!


ఆన్‌లైన్‌ వ్యవహారాలకు సంబంధించి దేన్ని, ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దని చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి సూచించారు. మొబైల్‌కు వచ్చే లింక్‌లను క్లిక్‌ చేయొద్దని చెప్పారు. బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు, పిన్‌ నెంబర్లు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు ఇతరులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ చెప్పొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా సైబర్‌ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు..