Chittoor Jallikattu Bull Fight kills one person: చిత్తూరు : చిత్తూరు జిల్లా వికోట‌ మండలం ఎర్రినాగేపల్లిలో నిర్వహించిన జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. సరిహద్దు ప్రాంతం కావడంతో ఎన్నో ఏళ్ల నుంచి తమిళనాడు సాంప్రదాయంను పాటిస్తూ సంక్రాంతి పండుగ తరువాత జల్లికట్టును నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ జల్లికట్టును వీక్షించేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అయితే ఎద్దులను కట్టిన బహిమతులను చేజిక్కించుకునేందుకు యువత ఉత్సాహం చూపించారు. కానీ జల్లికట్టు సరదాకు ఓ వ్యక్తి మృతి చెందారు.


జల్లికట్టే చూసేందుకు వెళ్తే ప్రాణం పోయింది.. 


ఎద్దులను లొంగదీసుకునేందుకు, వాటి కొమ్ములు పట్టుకుని అదుపు చేసేందుకు కొందరు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఎద్దులు పరుగులు పెడుతున్న సమయంలో జల్లికట్టు (Jallikattu)ను వీక్షించేందుకు వచ్చిన మోర్నాపల్లికి చెందిన శీనప్ప(54)ను ఓ ఎద్దు బలంగా ఢీ కొనడంతో శీనప్ప తీవ్రంగా పడ్డాడు. మరో నాలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని హుటాహుటిన వికోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శీనప్ప మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై‌ కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆసుపత్రికి తరలించారు.


గత నెల నుంచి జోరుగా జల్లికట్టు..
చిత్తూరు జిల్లా సోమల మండలం, పెద్ద ఉప్పరపల్లెలో జల్లికట్టు వేడుకలు ఘనంగా జరిగింది. సంక్రాంతి పండుగ ముందు, పండుగ‌ అనంతరం పశువుల‌ పండుగా పిలుచుకునే జల్లికట్టును చిత్తూరు జిల్లా వాసులు ఎంతో వేడుకగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగను గొప్ప పండుగగా భావించి గ్రామ పెద్దలు, సర్పంచ్ సమక్షంలో నిర్వహిస్తూ వస్తుంటారు. ఈ వేడుకలకు అటు కర్ణాటక, తమిళనాడు నుండే కాకుండా చుట్టు పక్కల దాదాపు 30 గ్రామాల ప్రజలు ఈ పశువుల పండుగను హాజరై ఉత్సహంగా తిలకిస్తారు. 


ఈ పండుగ సందర్భంగా తమ ఇంటిలో ఉన్న ఆవులకు ఎద్దులకు స్నానాలు చేయించిన అనంతరం గోపూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రజలు పశువుల కొమ్ములకు రంగులు వేస్తారు. అలాగే బహుమతులు కట్టి అశేష జనాల మధ్య పండుగను జరుపుకుంటారు. అలాగే పశువుల కొమ్ములకు కొంత ఉపకరణాలు లేక పైకం కట్టి బారికేడ్లు కట్టిన  జనాల మధ్యకు ప్రభలు కట్టిన  పశువులను వదులుతారు. ఈ ప్రభల మధ్య బహుమతులు చేజిక్కించు కోవడానికి యువకులు ముందుకు వస్తారు. వాటి పరుగులను అడ్డుకొని వాటికి కట్టిన బహుమతులు చేజిక్కించుకునేందుకు పోటీ పడతారు. 


ఈ జల్లికట్టు పోటీలలో అక్కడ పాల్గొన్న యువకులు గాయాలు కావచ్చు లేక మరణాలు కూడా సంభవించిన సందర్భాలున్నాయి. ఆదివారం జరిగిన జల్లికట్టులో పాల్గొన్న పలువురి కి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరికి మాత్రం తీవ్రంగా గాయాలు అయినట్లు సమాచారం. వీరిని వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు త రలించారు. ఈ జల్లికట్టు మద్యాహ్నం ఒక గంటకు ప్రారంభంమై 4 గంటలకు ముగుస్తుంది. ఈ పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.