దుర్గగుడి ట్రస్టు బోర్డులో ఈసారి నాయీ బ్రహ్మణులకు అవకాశం కల్పించారు సీఎం జగన్. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో, ఎన్నిక‌ల ముందు నిర్వ‌హించిన బీసీ గ‌ర్జ‌న‌లో బీసీల‌కిచ్చిన మ‌రో హామీని జగన్ నిలబెట్టుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. సోమవారం రాత్రి పేర్కొన్న జాబితాలో నాయీ బ్రాహ్మణులను పేరు ప్రస్తావించింది.  

దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామ‌కాల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయాల్లో పలు కార్యక్రమాల్లో సేవలందించే నాయీ బ్రాహ్మణులు ఎప్పటి నుంచో  బోర్డులో సభ్యత్వం కావాలని పోరాటం చేస్తున్నారు. దీనిపై పాదయాత్ర టైంలో జగన్‌కు విన్నవించుకున్నారు. 

దేశ చరిత్రలోనే నాయీ బ్రాహ్మణులకు అరుదైన గౌరవం: వైసీపీ

గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ సోమవారం జారీ చేసింది. అందులో నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించాలని పేర్కొంది. ఇది దేశంలోనే అరుదైన గౌరవంగా వైసీపీ పేర్కొంటోంది. 

రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో ఏడాదికి రూ.5 లక్షల పైబడి వార్షికాదాయం ఉన్న ఆలయాలు 1,234 వరకు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ట్రస్టు బోర్డు నియామకాలు పూర్త‌ైన వాటిని మినహాయిస్తే మరో 610 ఆలయాలకు కొద్ది రోజుల్లో కొత్తగా ట్రస్టు బోర్డులను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. వీటిల్లో ప్రతి ఆలయానికి ఒకరి చొప్పున నాయీ బ్రాహ్మణులకు ట్రస్టు బోర్డులో స్థానం కల్పించే అవకాశం ఉంది.

ఆలయాల వ్యవస్థలో అర్చకులతో పాటు నాయీ బ్రాహ్మణులకు విడదీయరాని బంధం ఉంది. ఆలయాల్లో భజంత్రీలుగా, క్షురకులుగా, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామి వారి ఊరేగింపు పల్లకీ సేవల్లో నాయీ బ్రాహ్మణులు పాలుపంచుకుంటున్నారు. ఆలయాల్లో పలు కార్యక్రమాల్లో సేవలందించే తమకు పాలకవర్గాల్లో చోటు కల్పించాలన్న నాయీ బ్రాహ్మ‌ణుల డిమాండ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో సానుకూల హామీ ఇచ్చారు. బీసీ గర్జన సభలలోనూ దీనిపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ దేవదాయ శాఖ చట్టానికి సవరణ తెచ్చి ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఆలయాల ట్రస్టు బోర్డు నియామకాల్లో తమకు చోటు కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.