Tirumala Laddu Issue: తిరుమల శ్రీనివానివాసుడి లడ్డూ ప్రసాదం కల్తీ చేశారన్న విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూను స్వచ్ఛమైన నెయ్యిని కాకుండా జంతువుల కొవ్వును వాడారంటూ సీఎంగా ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేయడంతో అన్ని వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పరమ పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో ఇలాంటి అపచారం చేశారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేస్తే... మరో వైపు కేంద్రం కూడా ఈ వివాదంపై ఫోకస్‌ పెట్టింది. 


చంద్రబాబుతో మాట్లాడిన జేపీ నడ్డా


తిరుమల లడ్డూ ప్రసాదం వివాదాన్న కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కేంద్రమంత్రులు ఘాటుగా స్పందిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు లెటర్లు రాస్తున్నారు. ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి నడ్డా స్పందించి చంద్రబాబుతో మాట్లాడారు. మొత్తం వ్యవహారంపై ఫుల్ రిపోర్టు ఇవ్వాలని ఏపీ సీఎంను కోరారు. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన జేపీ నడ్డా శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యత లోపాలపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు పంపిచాలని సూచించారు. కోట్ల మంది విశ్వాసాలను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. 


నివేదిక వచ్చిన తర్వాత చర్యలు: నడ్డా


రాష్ట్రం ప్రభుత్వం సమగ్ర విచారణ చేసిన తర్వాత రిపోర్టు సమర్పిస్తుందని అనంతరం ఏం చేయాలనే విషయంపై చర్చిస్తామన్నారు జేపీ నడ్డా. కేంద్రం, రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు.  


కఠిన చర్యలు తీసుకోవాలి: ప్రహ్లాద్ జోషి


మరో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తప్పు ఎక్కడ జరిగినా ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయం విన్నప్పుడు చాలా ఆందోళన కలిగిందన్నారు. తనతోపాటు కోట్ల మంది భక్తులకు ఇదే ఫీలింగ్ ఉంటుందని అందుకే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. 


ఫొటోలు తొలగించారు: శోభా కరందాజే 


ఇంకో కేంద్రమంత్రి శోభా కరందాజే కూడా జగన్‌పై, వైసీపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తిరుమల కళాశాలల్లో పద్మావతి, వేంకటేశ్వరుడి చిత్రాలు తొలగించి వాటి స్థానంలో వేరే ఫొటోలు పెట్టించారని మండిపడ్డారు. బోర్డు ఛైర్మన్‌ను కూడా హిందూయేతర వ్యక్తిని నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి: బండి సంజయ్‌


ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన ఆయన... టీటీడీని హిందూయేతరలకు అప్పగించడం వల్లే ఈ సమస్య వచ్చిందని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.