Tirumala News : శ్రీవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు కొండపై ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరినీ అడగకుండా ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకోవచ్చు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తిరుమలలో తన కార్యాలయంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి మంగళవారం క్యూఆర్ కోడింగ్ విధానాన్ని పరిశీలించారు.  తిరుమలలో టీటీడీకి సంబంధించిన అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు,  లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు ఇలా భక్తులకు అవసరమైన సుమారు 40 విభాగాల సమాచారాన్ని టీటీడీ క్యూఆర్ కోడ్ లో నిక్షిప్తం చేస్తుంది. 



అందుబాటులోకి క్యూఆర్ కోడ్ 


భక్తులు బస్టాండ్ లో దిగి సీఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూ ఆర్ కోడ్ ను తమ మొబైల్ లో  స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా పేర్లు కనిపిస్తాయి. అందులో తాము ఎక్కడికి వెళ్లాలో ఆ ప్రాంతం మీద క్లిక్ చేస్తే రూట్ మ్యాప్ డిస్ ప్లే అవుతుంది.  టీటీడీ ఇంజినీరింగ్, ప్రజా సంబంధాల విభాగాలు తయారు చేసిన ఈ విధానాన్ని ఈవో అభినందించారు. క్యూఆర్ కోడ్ భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. సేవా సదన్ నుంచి వివిధ ప్రాంతాల్లో  సేవ చేయడానికి వెళ్లే  శ్రీవారి సేవకులు వారు వెళ్లాల్సిన ప్రాంతం తెలుసుకోడానికి ఇబ్బంది పడుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రయోగాత్మకంగా శ్రీవారి సేవకుల ద్వారా ఈ విధానం అమలు చేయాలని ఈవో సూచించారు.  


తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం 


ఈ నెల 27 నుంచి అక్టోబ‌ర్‌ 5వ తేదీ వరకు జరిగే సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం సుందరంగా ముస్తాబవుతోంది. అందులో భాగంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. ఆళ్వార్లు మొత్తం 12 మంది. ఆ ప‌న్నెండు మందిలో కోయిల్ ఆళ్వార్ అనే వ్య‌క్తి లేడు. దేవాల‌యాన్నే ఆళ్వార్ గా వైష్ణవులు భావిస్తారు. అందుచేత కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం అంటే ప్ర‌ధాన దేవ‌త ఉన్న ప్రాంతాన్ని అభిషేకించ‌డం అని అర్థం. ఆలయ పరిసరాన్ని, ప్రత్యేకించి గర్బాలయాన్ని పవిత్రంగా ఉంచడానికి  జరిపే సేవ ఇది. ఆ పవిత్ర గర్భాలయ స్థానాన్ని సంప్రదాయ, వైఖానస ఆగమోక్తంగా శుద్ధి చేసే కైంకర్యమే కోయిల్ ఆళ్వారు తిరుమంజనం.


ఏడాది నాలుగు సార్లు 


కోయిల్‌ ఆళ్వార్‌ సేవ సంవత్సరంలో నాలుగు సార్లు జరుగుతుంది. ఉగాది స‌మ‌యంలో, ఆణివార ఆస్టానం స‌మ‌యంలో వార్షిక బ్రహ్మోత్స‌వాల‌కు ముందు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారాల్లో ఈ సేవ జరుగుతుంది. సుగందద్రవ్యాదులతో కలిపిన నీటితో గర్బాలయాన్ని శుద్ది చేయడం ఈ ఉత్సవం ప్రత్యేకత.  శ్రీవారి గ‌ర్భాల‌యానికి ఆనంద‌నిల‌యం అని పేరు. అక్క‌డి నుంచి ఆల‌య మ‌హాద్వారం వ‌ర‌కు శుద్ది చేస్తారు. ఈసంద‌ర్భంగా స్వామివారిపై దుమ్మూధూళి పడకుండా స్వామి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళవర్ణ వస్త్రాన్ని కప్పుతారు. దీన్నే ‘మలైగుడారం’ అంటారు. స్వామి అంశగా భావించే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మలైగుడారం లోపలే ఉంచుతారు. లోప‌ల అంతా శుద్ధి అయిన త‌ర్వాత మాత్ర‌మే భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు.  ఇక్కడే కొలువైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగద.. పరివార దేవతా మూర్తులను ఘంటా మండపం/ గరుడాళ్వార్ సన్నిధికి తరలిస్తారు. వాటి చుట్టూ తెల్ల‌టి వ‌స్త్రాల‌తో తెరలు కట్టి ఈ మూర్తులకు ఏకాంతంగా తిరుమంజనం పూర్తి చేసి కొత్త పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. ఇక గర్భాలయంలో మాత్రం కేవ‌లం అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పుకు అంటుకున్న దుమ్ముధూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో  శుద్ధిచేస్తారు.