Police Rescued Five People In Eluru: ఏలూరు (Eluru District) జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేలేరుపాడు మండలం అల్లూరినగర్ వద్ద ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. కోయమాదారం, విప్పలకుంపు గ్రామాల మధ్య లోతువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. ప్రవాహ వేగాన్ని గమనించకుండా కారు డ్రైవర్ ముందుకు తీసుకెళ్లడంతో కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ క్రమంలో కారులోని వారు రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొద్దిదూరం వెళ్లాక వాగు మధ్యలోని చెట్ల పొదల్లో కారు చిక్కుకుపోవడంతో వారు కారు నుంచి బయటకు వచ్చి సహాయం కోసం చూశారు. కారులోని వారిని డ్రైవర్ రామారావు, సాయిజ్యోతి, గడ్డం కుందనకుమార్, జ్యోతి, గడ్డం జగదీశ్ కుమార్‌లుగా గుర్తించారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, గత ఈతగాళ్లతో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధం కాగా.. వాగు భారీగా పొంగుతుండడంతో ఆటంకం ఏర్పడింది.


సురక్షితంగా ఒడ్డుకు


ఈ ఘటనపై స్పందించిన సీఎంవో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎంవో అధికారులు,,  ఏలూరు జిల్లా కలెక్టర్‌ సహా, ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులతో మాట్లాడారు. ఈ లోపే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, స్థానికుల సాయంతో బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా.. సాహసంతో తాళ్లు కట్టి బాధితుల వద్దకు వెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దాదాపు 4 గంటల ఉత్కంఠ తర్వాత కారులోని వారు సేఫ్‌గా ఒడ్డుకు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి సాహసంతో బాధితులను కాపాడిన వారికి స్థానిక ఎమ్మెల్యే బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు.


తప్పిన మరో ప్రమాదం


అటు, ఏలూరు జిల్లాలోనే మరో ప్రమాదం తప్పింది. బుట్టాయగూడెం వద్ద విద్యార్థులతో వెళ్తున్న బస్సు వాగు మధ్యలో చిక్కుకుపోయింది. వాగు పొంగి రోడ్డుపై నుంచి వెళ్లడంతో మధ్యలో బస్సు చిక్కుకుంది. దీంతో డ్రైవర్, విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వాగు మధ్యలోకి వెళ్లి బస్సును నెడుతూ ఒడ్డుకు చేర్చారు. దీంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. విద్యార్థులను రక్షించిన స్థానికులపై ప్రశంసలు కురుస్తున్నాయి.


కంట్రోల్ రూం ఏర్పాటు


మరోవైపు, జిల్లాలో భారీ వర్షాల క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. వరద ప్రభావం ఎక్కువగా ఉంటే 18002331077కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 


వరదలో చిక్కుకున్న కూలీలు


అటు, తెలంగాణవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న క్రమంలో పలు జిల్లాల్లో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు ఒక్కసారిగా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేయడంతో దిగువ భాగంలో నీటి ప్రవాహం పెరిగిపోయింది. దీంతో కొత్తగూడెంంలోని నారాయణపురం వద్ద 20 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో వారంతా సహాయం కోసం ఎదురుచూస్తుండగా పోలీసులు, అధికారులు రంగంలోకి దిగారు. హెలికాఫ్టర్ ద్వారా బాధితులను రక్షించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు, రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టాయి.


పెద్దవాగు ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండిపోయి పై నుంచి నీరు ప్రవహించడంతో కట్ట తెగిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో గుమ్మడపల్లి, కమ్మర గూడెంతో పాటు వేలేరుపాడు మండలంలోని మాధవరం, మేడిపల్లి, రామవరం, రెడ్డిగూడెం సుమారు 20 గ్రామాలను వరద భయం వెంటాడుతోంది. అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


Also Read: Tirumala : శ్రీవాణి టిక్కెట్లు కొని తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా ? - ఈ విషయం తెలుసుకోవాల్సిందే