AP Coastal :   ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు ఉందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.  రాష్ట్రంలోని 43.35 శాతం తీరానికి అతి తక్కువగాను, 33.27 శాతం తీరానికి ఓ మోస్తరు కోత ముప్పు ఉన్నట్లుగా ఇన్‌కాయిస్‌ అధ్యయనం పేర్కొనట్లు తెలిపారు.  సముద్రమట్టం పెరగకుండా నియంత్రించే చర్యల కోసం జాతీయ విపత్తు ఉపశమన నిధి (NDMF)కి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. 



దీనికి అదనంగా తీరప్రాంత కోత వలన నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరో వేయి కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. ఈ నిధిని ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఎంఎఫ్‌ సంస్థలకు 80-20 నిష్పత్తిలో విభజించడం జరిగిందని నిత్యానంద్‌ రాయ్‌ వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో ఎన్‌డీఎంఎఫ్‌ను నెలకొల్పిందని తెలిపారు. సముద్ర కోతల వలన తీర ప్రాంతాలకు ఎదురవుతున్న ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంస్థలు... ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు అందిస్తూ సాంకేతికపరమైన పరిష్కార మార్గాలను సూచిస్తున్నాయని నిత్యానంద్‌ రాయ్‌ రాతపూర్వక సమాధానంలో చెప్పారు.


మానవత్వం లేకుండా ధరలు పెంచుతున్నారు - కేంద్రంపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీల ఫైర్



గతంలో పలుమార్లు ఏపీలోని విశాఖ పట్నం మునిగిపోతుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ నివేదిక విడుదలచేసింది.  గ్లోబల్ వార్మింగ్, వాతావరణ పరిస్థితులపై అమెరికా అంతరిక్ష సంస్థ విడుదల చేసిన నివేదికలో వచ్చే 80 ఏళ్లలో భారత్ లో 12 నగరాలు నీటమునగడం ఖాయమని వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరమైన విశాఖపట్నం కూడా ఉంది.  గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరగడం వల్ల తీరప్రాంతాల్లోని ప్రజలకు ప్రమాదం తప్పదని హెచ్చరించింది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ (NASA)నివేదిక ప్రకారం, ఓఖా, మోర్ముగావ్, భావ్‌నగర్, ముంబై, మంగళూరు, చెన్నై, విశాఖపట్నం, టుటికోరన్, కొచ్చి, పారాదీప్ మరియు కిడ్రోపోర్ తీర ప్రాంతాలపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రంగా ఉండనుందని చెప్పింది.


మీ సైకోతనానికి ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడింది - వైసీపీ నేతలకు లోకేష్ వార్నింగ్ ! ఆ విషయంలోనే



విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన తర్వాత ఈ నివేదిక వెలుగులోకి రావడంతో రాజకీయంగానూ కలకలం రేపింది. తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను కూడా ఓ ప్రముఖ అంతర్జాతీయ పారిశ్రామికవేత్త..  విశాఖ మునిగిపోతుందట కదా అని ప్రశ్నించారట. ఈ విషయాన్ని మంత్రే స్వయంగా చెప్పారు. అయితే విశాఖ మునిగిపోదని.. అదంతా దుష్ప్ర్చరామేనని చెప్పానన్నారు. ఈ అంశం తప్పు అని చెప్పడానికి విజయసాయిరెడ్డి లోక్‌సభలో ప్రశ్న అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే తీర ప్రాంతాలకు ముప్పు ఉందని సమాధానం రావడంతో నాసా నివేదికను కొట్టి పారేయలేమన్న వాదన వినిపిస్తోంది.